Harishrao Comments: రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సహాయక చర్యలు చేపట్టడంలో, వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మంగళవారం ఖమ్మంలోని వరద బాధిత ప్రాంతాలను ఆయన పరిశీలించారు. బాధితులను పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు.
అనంతరం ఆయన బీఆర్ఎస్ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై మండిపడ్డారు. భారీ వర్షాలు, వరదల కారణంగా 30 మంది మృతిచెందితే, కేవలం పదిహేను మందే చనిపోయారంటూ ప్రభుత్వం చెబుతున్నదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చనిపోయినవారి సంఖ్యను కూడా తక్కువగా చూపడం దారుణమన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సాగర్ ఎడమకాలువకు గండి పడిందన్నారు. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
Also Read: బీఆర్ఎస్ నేతల ఖమ్మం పర్యటనలో ఉద్రిక్తత.. వాహనాలపై రాళ్లదాడి
‘సహాయం కోసం వరద బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. కూలీ పని చేసి కూడబెట్టుకున్న నిత్యావసరాలు సహా దస్త్రాలు, పుస్తకాలు కూడా కొట్టుకుపోయాయి. వరదలు ముంచెత్తడంతో బాధితులు ఇళ్లపై ఆహారం కోసం ఆర్తనాదాలు చేస్తున్నా.. వారికి ఆహారం కూడా అందించడంలేదు. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోన్నది. రాష్ట్రానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేంద్రం ఎందుకు పంపలేదు? ఇటు కేంద్రం కూడా రాష్ట్రాన్ని ఆదుకోవడంలో విఫలమైంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి. అందరం కలిసి ఢిల్లీకి వెళ్లి మనకెందుకు సాయం చేయదో కేంద్రాన్ని నిలదీద్దాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి మహబూబాబాద్, ఖమ్మం ప్రజలు బలైపోయారు. వరదల్లో చనిపోయినవారి కుటుంబాలకు రూ. 25 లక్షలు అందించాలి. నష్టపోయినవారికి తక్షణమే రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించాలి. వర్షం వల్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటివరకు ప్రభుత్వం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేకపోయింది. బాధితులకు ఆహారం, మంచినీరును కూడా సరఫరా చేయలేదు. వరదలు ముంచెత్తడంతో వారి ఇళ్లల్లో ఎటు చూసినా కూడా నీళ్లే కనిపిస్తున్నాయి. కానీ ప్రభుత్వం వారికి ఆహారం ఇవ్వకుండా బియ్యం ఇస్తున్నది.. ఈ సమయంలో బియ్యం ఇస్తే వారు ఎలా వండుకుంటారు..? ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేలుకోవాలి’ అంటూ హరీశ్ రావు వ్యాఖ్యానించారు.
Also Read: వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ.. ఆ వివరాలను రివీల్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
కాగా, ఖమ్మంలో వీరి వాహనంపై రాళ్ల దాడి జరిగింది. అయితే, ఖమ్మం జిల్లా వెళ్లడానికి ముందు సూర్యాపేట జిల్లాలోని కోదాడ నియోజకవర్గానికి హరీశ్ రావు తన అనుచరులతో కలిసి వెళ్లారు. పలు గ్రామాల్లో పర్యటించి, వరదల వల్ల నష్టపోయిన పంటలను ఆయన పరిశీలించారు. అదేవిధంగా నీటి కాలువలను కూడా పరిశీలించారు. అనంతరం బాధితులతో మాట్లాడి జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఆ తరువాత ఖమ్మం జిల్లాకు వెళ్లారు. ఖమ్మంలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు. పలువురు వరద బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే వారి కారుపై ఒక్కసారిగా రాళ్ల దాడి జరిగింది. ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ప్రతిదాడి చేశారు. దీంతో కొద్దిసేపు అక్కడ టెన్షన్ వాతావరణం క్రియేటయ్యింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భారీగా మోహరించారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. వారిని ఆసుపత్రికి తరలించారని సమాచారం.