Bandi Sanjay: కరీంనగర్ గడ్డ.. బీజేపీ అడ్డా.. అంటూ ప్రజా గర్జన చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. తెలంగాణను కేసీఆర్ దోచుకుంటున్నారని ఆరోపించారు. డ్రగ్స్ దందా, లిక్కర్ దందా, గనుల దందా, ప్రాజెక్టుల దందాతో డబ్బులు పోగేసుకుంటున్నారని మండిపడ్డారు. ఆ డబ్బుతో బీఆర్ఎస్ అంటూ.. ఇక దేశాన్ని దోచుకునేందుకు బయటు దేరారని విమర్శించారు.
బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని.. బార్ అండ్ రెస్టారెంట్ సమితి అంటూ ఎద్దేవా చేశారు బండి సంజయ్. దేశాన్ని దోచుకోవడానికి తోడు దొంగలంతా ఒక్కటవుతున్నారని మండిపడ్డారు.
కేసీఆర్, జగన్ లు కలిసి రెండు రాష్ట్రాలను దోచుకుంటున్నారని ఆరోపించారు. దోచుకుందాం.. కమీషన్లు దాచుకుందాం.. అనే కాన్సెప్ట్ లో ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి పని చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు తిరస్కరిస్తే.. అక్కడ జై ఆంధ్ర.. ఇక్కడ జై తెలంగాణ నినాదాన్ని ఎత్తుకుంటున్నారని విమర్శించారు బండ సంజయ్.
తెలంగాణ తల్లికి ద్రోహం చేసి.. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేశారని తప్పుబట్టారు. కేసీఆర్ పాలనలో అన్నివర్గాలు అన్యాయానికి గురవుతున్నారని బండి సంజయ్ అన్నారు. ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా కరీంనగర్ బహిరంగ సభలో బండి సంజయ్ సింహ గర్జన చేశారు.
తనను ఎన్నో అవమానాలకు గురి చేశారని.. డిపాజిట్ రాదని హేళన చేశారంటూ.. బండి సంజయ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. అవమానాలకు భయపడేది లేదని.. ధర్మం కోసం యుద్ధం చేస్తామని తేల్చి చెప్పారు.