BRS Party: బీఆర్ఎస్ నాయకుల ఖమ్మం పర్యటన ఉద్రిక్తంగా మారింది. వరద బాధితులను పరామర్శించడానికి మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్ రావు ఖమ్మం వెళ్లారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో వారు పర్యటిస్తుండగా అనూహ్యంగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వారి వాహనాలపై రాళ్తతో దాడి చేశారు. ఈ దాడిలో మంత్రులు కార్ల అద్దాలు పగిలిపోయాయి. దాడి చేసిన వారిపై ప్రతిదాడికి బీఆర్ఎస్ కార్యకర్తుల ప్రయత్నించారు. ఈ ఘర్షణలో ఓ బీఆర్ఎస్ కార్యకర్తకు గాయాలయ్యాయి. వెంటనే హాస్పిటల్ తరలించారు. ఈ క్రమంలోనే వారి పర్యటన ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కేంద్రం మంచికంటి నగర్లో చోటుచేసుకుంది.
బీఆర్ఎస్ నాయకుల వాహనాలపై రాళ్ల దాడి జరగ్గానే ఆ పార్టీ శ్రేణులు ప్రతిదాడికి ప్రయత్నించారు. ఇంతలో పరిస్థితులను అంచనా వేసిన పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేశారు. ఉద్రిక్తతలను అదుపులోకి తెచ్చారు. ఈ పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎందుకు రాలేవని ప్రశ్నిస్తూ.. ప్రజల ప్రాణాలను కాపాడటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని ఫైర్ అయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిందేమీ లేదని, కేంద్ర బడ్జెట్లోనూ సున్నా అని, వరద సాయంలోనూ గుండు సున్నా అంటూ విరుచుకుపడ్డారు. సహాయం చేయడానికి వస్తే దాడులు చేస్తారా అంటూ హరీశ్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి తమ చరిత్ర తెలియదని, ఉద్యమ సమయంలో ఇలాంటివి చాలానే చూశానని అన్నారు.
Also Read: Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!
ఖమ్మం జిల్లా వెళ్లడానికి ముందు వారు సూర్యాపేట జిల్లాలోని కోదాడ నియోజకవర్గానికి బీఆర్ఎస్ నాయకులు వెళ్లారు. నాయకని గూడెం, రామచంద్రాపురం గ్రామాల్లో పర్యటించారు. వరదల వల్ల నష్టపోయిన పంటను పరిశీలించారు. నీటి కాలువనూ పరిశీలన చేశారు. ఆ తర్వాత స్థానికులతో మాట్లాడి కష్ట, నష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వారు ఖమ్మం జిల్లాకు వెళ్లారు. ఖమ్మం జిల్లాలో వరద బాధితులను పరామర్శించారు. పలువురు వరద బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం మొదలు పెట్టారు. ఇంతలోనే వారి కారుపై దాడి జరిగింది.
ఖండించిన కేటీఆర్
ఖమ్మంలో కాంగ్రెస్ గూండాలు దాడి చేశాయని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలపై చేసిన దాడిని ఖండించారు. హరీష్ రావు, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, జగదీష్ రెడ్డి వాహనాలపై దాడి చేయడం కాంగ్రెస్ అసహనానికి నిదర్శనమన్నారు. ప్రజలకు సాయం చేయడం చేతగాక, సాయం చేస్తున్న వాళ్లను చూసి ఓర్వలేకే ఈ దాడికి తెగబడ్డారని విమర్శించారు. ‘‘మీరు ప్రజలను నిర్లక్ష్యం చేస్తే వారికి అండగా ఉండటమే తప్పా? ప్రజలకు సేవ చేయటం చేతకాదు, సేవ చేసే వాళ్లపై మాత్రం దాడి చేయటమా? సిగ్గు చేటు. ఈ దాడికి ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇలాంటి ఎన్ని దాడులు చేసిన సరే, ప్రజల వద్ద బీఆర్ఎస్ శ్రేణులను వెళ్లకుండా ఆపలేరు. కాంగ్రెస్ చేతగాని, దద్దమ్మ పాలనను ప్రజలు గమనిస్తున్నారు. మీకు సరైన సమయంలో బుద్ధి చెప్పడం ఖాయం’’ అని హెచ్చరించారు కేటీఆర్.