CM Revanth Reddy Visited Flood Effected Areas: మహబూబాబాద్ జిల్లాల్లో వరద బాధిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. వరద ముంచెత్తిన ప్రాంతాలను ఆయన పరిశీలించి బాధితులతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు. అదేవిధంగా యువ శాస్త్రవేత్త అశ్వినీ, ఆమె తండ్రి మోతీలాల్ మృతిచెందిన స్థలాన్ని కూడా ఆయన పరిశీలించారు. సీతారాంపురం తండాలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘భారీ వర్షాలతో ఆకేరు వాగు పొంగి ఇక్కడే యువ శాస్త్రవేత్త అశ్వినీ, ఆమె తండ్రి మోతీలాల్ మరణించారు. అశ్వినీ మాతృమూర్తి, సోదరుడుని పరామర్శించా. అశ్వినీ యువ శాస్త్రవేత్త ఆమె మరణం చాలా బాధాకరం. ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నాం. అశ్వినీ కుటుంబానికి ఇల్లు లేదు… ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నాం.
Also Read: ఇక.. జిల్లాల్లోనూ హైడ్రా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
ఆకేరు వాగు పొంగిన ప్రతిసారి సీతారాం తండాతో పాటు పక్కన ఉన్న మరో రెండు తండాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ మూడు తండాలు కలిపి ఒకే పెద్ద గ్రామంగా మార్చేందుకుగాను అందరికీ ఒకే చోట ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని హౌసింగ్ డిపార్టుమెంట్ ను ఆదేశిస్తున్నా. ఆకేరు వాగు పొంగి ఇళ్లలోని పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు, సర్టిఫికెట్స్ తడిచిపోయినందున ఒకే ఎఫ్ఐఆర్ దాఖలు చేసి, అందరికీ నూతన కార్డులు, సర్టిఫికెట్స్ ఇవ్వాలని అధికారులను ఆదేశించా. ఆకేరు ప్రవాహం… నీటి నియంత్రణపై శాస్త్రీయంగా అంచనా వేసి నూతన వంతెన నిర్మించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాను’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఆ తరువాత మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను సీఎం రేవంత్ రెడ్డి తిలకించారు. భారీ వర్షాలతో మహబూబాబాద్ జిల్లాలో వాటిల్లిన నష్టాలపై జిల్లా కలెక్టరేట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్ , ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
Also Read: గుండె కరిగిపోయే దృశ్యాలు.. సీఎం రేవంత్ ఎమోషనల్ ట్వీట్
ఇదిలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు, పలువురు బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో ప్రజలు ఆందోళన చెందుతుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలో భారీగా వరదలు ముంచెత్తడంతో ప్రజలు సర్వం కోల్పోయిన దిక్కుతోచని స్థితిలో ఉండి సాయం కోరుతున్నారన్నారు. కనీసం వారికి తినడానికి ఏం దొరక్క అవస్థలు పడుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లను ఆదుకోవాల్సిందిపోయి రాజకీయాలు మాట్లాడడం ఎంతవరకు సరి అంటూ ప్రశ్నించారు. వరద బాధితులకు ప్రభుత్వం బియ్యాన్ని ఇస్తున్నదని.. కానీ, సర్వం కోల్పోయి.. కనీసం నిలువ నీడలేక ఉన్న బాధితులు ఆ బియ్యాన్ని ఎలా వండుకుంటారన్నది కూడా ప్రభుత్వానికి తెలియదా అంటూ ప్రశ్నించారు. బాధితులు తీవ్ర ఆకలితో అలమటిస్తున్నారని చెప్పారు. వెంటనే వారికి ఆహారం అందించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.