Farm House case: ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అనేక మలుపులు తిరుగుతోంది. మొయినాబాద్ నుంచి ఢిల్లీ వరకు లింకులు బయటికొచ్చాయి. ఏకంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎస్ సంతోష్ కే నోటీసులు జారీ అయ్యాయి. అయితే, దూకుడుగా ఉన్న సిట్ కు హైకోర్టు బ్రేకులు వేసింది. సంతోష్, జగ్గుస్వామి, తుషార్ లకు ఇచ్చిన నోటీసులపై స్టే విధించింది. మరోవైపు, కేసును సీబీఐకి అప్పగించాలంటూ నిందితులు నందకుమార్, రామచంద్రభారతి వేసిన పిటిషన్ పైనా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
సీఎం కేసీఆర్ తమకు పెన్ డ్రైవ్లు, సీడీల రూపంలో ఫాంహౌజ్ వీడియో ఫుటేజీని పంపించారని.. అవి చీఫ్ జస్టిస్కు కూడా అందాయని.. ధర్మాసనం తెలిపింది. కేసీఆర్ పంపిన ఆ ఎవిడెన్సులను ఇంకా పరిశీలించలేదని.. విచారణ సందర్భంగా వాటిని పరిగణనలోకి తీసుకుంటామని కోర్టు తెలిపింది. సీఎం కేసీఆర్ పంపిన ఫూటేజ్ చూసిన తర్వాత విచారణ చేపడతామని స్పష్టం చేసింది. సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది హైకోర్టు.
మొయినాబాద్ ఫాంహౌజ్ లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ముగ్గురు మధ్యవర్తులు బేరసారాలు ఆడిన ఉదంతం తెలిసిందే. ఫాంహౌజ్ లో జరిగిన ఆ ఎపిసోడ్ మొత్తాన్ని సీక్రెట్ కెమెరాల్లో బంధించారు. ఆ ఫుటేజ్ ఇప్పుడు కేసు విచారణలో కీలకంగా మారనుంది. అయితే, పోలీసుల దగ్గర మాత్రమే ఉండాల్సిన ఈ వీడియో రికార్డింగ్స్ ను సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో బయటపెట్టడం వివాదాస్పదమైంది. ఆ ఫుటేజ్ ని హైకోర్టు, సుప్రీంకోర్టుతో సహా దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలకూ పంపించారు సీఎం కేసీఆర్. అలా నేరుగా న్యాయమూర్తులకు వీడియో రికార్డింగ్స్ పంపించడాన్ని ఓ సందర్భంలో కోర్టు కూడా తప్పుబట్టింది. కానీ, ఇప్పుడు అదే కోర్టు.. సీఎం కేసీఆర్ పంపించిన ఫుటేజ్ ను పరిశీలిస్తామని.. ఆ తర్వాతే విచారణ చేపడతామని నిర్ణయించడం ఆసక్తికర పరిణామం అంటున్నారు.