Paris Paralympics 2024: పారిస్ పారాలింపిక్స్ లో పతకాల జోరు మొదలైంది. ఇప్పటికి భారత్ పతకాల సంఖ్య 11కి చేరింది. అందులో 2 స్వర్ణ, 4 రజత, 5 కాంస్య పతకాలున్నాయి. అంతేకాదు క్రీడాకారులు తమ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ వారి ఆటను చూసిన ప్రతి ఒక్కరూ వీరిలో ఉన్న పట్టుదలలో కనీసం 10 శాతం నేటి యువతలో ఉన్న భారతదేశం ఎక్కడికో వెళ్లిపోతుందని అంటున్నారు.
ఇకపోతే భారత పారా స్ప్రింటర్ 17 ఏళ్ల ప్రీతి పాల్ రికార్డు సృష్టించింది. మహిళల 200 మీటర్ల టీ35 కేటగిరీలో కాంస్య పతకం గెలుచుకుంది. దీంతో ట్రాక్ అండ్ ఫీల్డ్లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్గా రికార్డుకెక్కింది.
అంతకుముందు మహిళల 100మీ టీ35 లోనూ ప్రీతి కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే. పారిస్ ఒలింపిక్స్ లో యువ షూటర్ మను బాకర్ రెండు కాంస్యాలు సాధించినట్టే ప్రీతి కూడా సాధించడం విశేషం. యూపీకి చెందిన తను సోషల్ మీడియాలో పారాలింపిక్ గేమ్స్ క్లిప్లను చూసి.. ఇన్ స్పైర్ అయినట్లు తెలిపింది.
Also Read: ఒక్కరోజే ఐదు పతకాలు.. పారాలింపిక్స్లో భారత్ హవా!
అలా తన గురువు, పారాలింపియన్ ఫాతిమా ఖాటూన్ను కలవడంతో తన జీవితం మలుపు తిరిగింది. ఆమె శిక్షణలో రాటు దేలింది. అనంతరం ఢిల్లీలోని నెహ్రూ స్టేడియంలో కోచ్ గజేందర్ సింగ్ వద్ద రన్నింగ్ లో శిక్షణ పొందింది. చివరికి పారిస్ పారాలింపిక్స్ లో 100, 200 మీటర్ల ఈవెంట్లలో కాంస్య పతకాలను సాధించింది.
ఇకపోతే పారా బ్యాడ్మింటన్ ఫైనల్లో టాప్ సీడ్ భారత పారా షట్లర్ నితేష్ కుమార్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 18-21, 23-21 తేడాతో తన ప్రత్యర్థి డానియల్ బెతెల్ ను ఓడించాడు. చైనాలో జరిగిన ఆసియా పారా గేమ్స్లో రజత పతకం సాధించిన నితేష్ ఇంజనీర్ గా పనిచేసేవాడు. అయితే ఒక రైలు ప్రమాదంలో ఎడమకాలు కోల్పోయాడు.
పురుషుల డిస్కస్ త్రో ఎఫ్ 56 ఫైనల్లో ఐదు త్రోల తర్వాత భారతదేశానికి చెందిన యోగేష్ కథునియా రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు.
బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఎస్ యూ 5 ఫైనల్ లో తులసిమతి మురుగేశన్ రజత పతకం సాధిస్తే, మనీషా రామ్ దాస్ కాంస్య పతకం సాధించారు. మొత్తానికి పారాలింపిక్స్ ఐదు రోజులు ముగిసేసరికి భారత్ 11 పతకాలతో 22వ స్థానంలో నిలిచింది.