Private Tractor Owners demand p2 thousand rupees from flood effected public: విజయవాడ ఇప్పుడు ఎక్కడ చూసినా వరద ..దాని తాలూకు బురద మాత్రమే కనిపిస్తోంది. చెట్టుకొరకు, పుట్టకొకరు అన్నట్లుగా ఎక్కడికక్కడ ఇరుక్కుపోయారు. చరిత్రలో ఎన్నడూ చూడని ప్రకృతి భీభత్సాన్ని చవిచూశారు విజయవాడ వాసులు. విజయవాడ ప్రజలకు బుడమేరు కన్నీరుగా మారింది. నగరం మధ్య నుంచి ప్రవహించే బుడమేరు నగరవాసులకే కాదు..చుట్టుపక్కల గ్రామాలపైనా తన విశ్వరూపం చూపుతోంది. నాలుగు లక్షల మంది దాకా నిర్వాసితులయ్యారు. వారి కోసం ఏపీ ప్రభుత్వం ఆహార పొట్లాలను , మందులను, మంచినీటి ప్యాకెట్లను నిరంతరం సరఫరా చేస్తోంది. కొన్ని ప్రాంతాలలో పరిస్థితి కాస్త మెరుగుపడుతుండగా మరికొన్ని ప్రాంతాలలో మాత్రం ఇంకా మొలలోతు నీళ్లలోనే ఉండిపోతున్నారు జనం.
సందట్లో సడేమియా
ఇదిలా ఉండగా సందట్లోసడేమియా అన్నట్లుగా కొందరు వరదలను కూడా క్యాష్ చేసుకుంటున్నారు.ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోట్లు ఏ మూలకీ చాలడం లేదు. యువకులు అలాగే ఈదుకుంటూ వెళుతున్నారు. అలా వెళ్లలేని వారు బోట్లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ వరద నీటినుండి ఎక్కవ సంఖ్యలో జనాలను చేరవేయడానికి ట్రాక్టర్ యజమానులు పోటీ పడుతున్నారు. అయితే అదేదో ఉచిత సేవ అనుకుంటే పొరపాటే. కేవలం ఒకటిన్నర కిలో మీటర్ల దూరానికే ఒక్కో ఫ్యామిలీ నుంచి రెండు వేలు డిమాండ్ చేస్తున్నారు. అదేమిటని అడిగితే ‘మేము కూడా వరదల్లో రిస్క్ చేస్తున్నాం. మా ప్రాణాలు పణంగా పెట్టి మిమ్మల్ని కాపాడుతున్నాం..మా ప్రాణాలకు మీరు గ్యారెంటీ ఇస్తారా’ అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.
దోచుకుంటున్నారు
కొందరు మాత్రం ఇప్పుడు వాదోపవాదాలు ఎందుకు? ముందు ఎలాగోలా పని జరగాలని మరికొందరు రాజీ పడిపోతున్నారు. ప్రైవేటు మర బోటు యజమానులు కూడా తామేమీ తక్కువ తిన్నామా అంటూ వారు కూడా ఒక్కో కుటుంబానికి రూ.40 వేలు ఛార్జి చేస్తున్నారు. వన్ టౌన్, భవానీపురం, గొల్లపూడి, గుణదల, కృష్ణ లంక ప్రాంతాలలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు సాధ్యమైనంత తొందరగా చేరుకోవాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెస్క్సూ టీమ్ వచ్చేలోగా ఎదురుచూసే ఓపిక లేక చాలా మంది వారు ఎంత డబ్బులు డిమాండ్ చేస్తున్నారో..అంత ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇక పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన ప్రజలు మాత్రం కాలినడకనే వెళుతున్నారు. డబ్బులు పెట్టే స్థోమత లేక.
అందరికీ అందడం లేదు
ఆహార పొట్టాలు కూడా తమకు అందుబాటులో ఉన్న ప్రాంతాలలోకి అందించేసి తప్పించుకుంటున్నారు అధికారులు. మారు మూల ప్రాంతాల ప్రజలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. యువకులు, నడి వయస్కులు ఎలాగోలా నీళ్లలోనే వెళ్లి ఆహార పొట్లాలను తెచ్చుకుంటున్నారు. వృద్ధులు తాము ఎక్కడికి వెళ్లగలమని వాపోతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరబోట్లలో ఆహార పదార్థాలను సరఫరా చేయాలి. కానీ కొన్ని చోట్ల మర బో ట్లు మొరాయిస్తున్నాయని అంటున్నారు. ప్రభుత్వ వాహనాలలో ఆహార పొట్లాలు రాగానే ఒక్కసారిగా జనం మీద పడిపోతున్నారు. క్రమపద్ధతిలో తీసుకోకపోవడంతో బలం గల వారిదే రాజ్యం అన్న తీరుగా సాగుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రభుత్వం తరపున ట్రాక్టర్లు, మర బో ట్లను ఏర్పాటు చేయాలని అంతా కోరుకుంటున్నారు.