CM Revanthreddy: వరదలు తెలంగాణను అతులాకుతలం చేశాయి. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. రోడ్డు, రైళ్ల ట్రాక్స్, చెరువులు, ఊళ్లకు ఊళ్లు ధ్వంసమయ్యాయి. సింపుల్గా చెప్పాలంటే వరద పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. కాస్త వాతావరణం తెరిపి ఇవ్వగానే సీఎం రేవంత్రెడ్డి రంగంలోకి దిగేశారు.
సోమవారం ఖమ్మం వెళ్లిన సీఎం రేవంత్రెడ్డి డ్యామేజ్ అయిన ప్రాంతాలను సందర్శించారు. అనంతరం బాధితులతో మాట్లాడి, వారికి దైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. రాత్రి ఖమ్మంలో ఉన్న సీఎం, మంగళవారం మహబూబాబాద్ జిల్లాకు వెళ్లారు.
ALSO READ: పొంచి ఉన్న మరో ప్రమాదం.. మరో మూడు రోజులు వర్షాలు!
అక్కడ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు ముఖ్యమంత్రి. ఆకేరు వాగు ఉధృతికి కొట్టుకుపోయిన పురుషోత్తంగూడెం బ్రిడ్జిని పరిశీలించనున్నారు. అంతకుముందు సీతారాంనాయక్ తండాకు వెళ్లనున్నారు. గ్రామాన్ని వరదనీరు ముంచెత్తడంతో వందలాది పోలీసులు కాపాడారు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి ముందుగా అక్కడికే వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
మరోవైపు ఏపీ మాదిరిగా తెలంగాణలోనూ బురద రాజకీయాలు మొదలయ్యాయి. విపక్ష బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై కౌంటరిచ్చారు సీఎం రేవంత్రెడ్డి. తెలంగాణలో మాదిరిగానే ఏపీలోనూ వరదలు వచ్చాయని, అక్కడ ప్రతిపక్ష నాయకులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని చెప్పుకొచ్చారు.
తెలంగాణలో కష్టమైన పరిస్థితులు వన్నాయని బీఆర్ఎస్ భావిస్తోందన్నారు సీఎం. అధికార పార్టీ కంటే ముందుగా ప్రతిపక్షం వెళ్లి అక్కడి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, ప్రభుత్వాన్ని నిలదీసే ఛాన్స్ వుందన్నారు. కానీ కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రారని, ఎందుకు సైలెంట్గా ఉన్నారో తెలీదన్నారు.
సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం, పార్టీ ఆఫీసులో నేతలతో మాట్లాడించడమే జరుగుతుందన్నారు సీఎం. దయచేసి విదేశాల నుంచి రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు. ఉద్యమకారుడిగా చెప్పుకునే కేసీఆర్, 16 మంది ప్రాణాలు కోల్పోయినా ప్రజలను పలుకరించేందుకు మనసు రాలేదన్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టం భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక అంచనా ప్రకారం.. 196 చెరువు కట్టలు తెగిపోగా 64 కాలువలకు గండ్లు పడ్డాయి. చాలా చోట్లా తాత్కాలిక మరమ్మతులు జరుగుతున్నాయి. పునరుద్ధరణకు ఖర్చు వందల కోట్లు అయ్యే అవకాశం ఉందని లెక్కలు వేస్తున్నారు. ఇదికాకుండా మూగజీవాలు మరణించడం వల్ల ఆ నష్టం వందల కోట్లలో నష్టం వాటిల్లినట్లు అంతర్గత సమాచారం.
నేడు మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్న సీఎం .
ఆకేరువాగు ఉధృతికి కొట్టుకుపోయిన పురుషోత్తంగూడెం బ్రిడ్జిని పరిశీలించనున్న రేవంత్ రెడ్డి.#Mahabubabad pic.twitter.com/ypRQYO103d— ChotaNews (@ChotaNewsTelugu) September 3, 2024