Heavy Rains To Hit Telangana State: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. పలు చోట్లు వాగులు, కట్టలు తెగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 24 గంటల పాటు కురిసిన కుండపోత వర్షాలకు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో వరదలు వచ్చాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే మరో అల్ప పీడనం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బుధవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 6, 7వ తేదీల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
గడిచిన 24 గంటల్లో కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, సిద్దిపేట, మెదక్ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో 25.4, సదాశివ్ నగర్ లో 24, నిజామాబాద్ జిల్లా తుంపల్లిలో 22.1 సెంటీమీటర్ల వర్షాపాతం రికార్డు అయింది.
ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని దాదాపు 11 జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ ఆదేశించారు. ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Also Read: బీఆర్ఎస్ ట్వీట్కు కౌంటరిచ్చిన భట్టి.. మళ్లీ రియాక్టైన హరీశ్రావు
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కలెక్టర్లు ముందస్తు ప్రణాళిక రూపొందించాలన్నారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రానున్న భారీ వర్షాలతో పరిస్థితులు తీవ్రంగా ఉండే అవకాశం ఉందన్నారు. పోలీస్, తదితర శాఖలతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించే విషయాల్లో కలెక్టర్లే నిర్ణయం తీసుకోవాలన్నారు.
స్వర్ణ, కడెం ప్రాజెక్టు గేట్లను తెరవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. నిర్మల్ జిల్లాకు 31మంది సభ్యులు, 4 బోట్లు ఉన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపుతున్నామని తెలిపారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి 20వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని, నీటి పరిమాణం ఎక్కువ అయితే పరివాహక ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టేందుకు అక్కడి అధికారులతో కోఆర్డినేట్ చేసుకోవాలని సూచించారు.
హైదరాబాద్ నుంచి ఏ రకమైనా సహాయం కావాలన్నా తమను సంప్రదించాలని కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి 24 గంటలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి క్రేన్ లు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు.