Bhatti Vs Harish rao: రాష్ట్రంలో భారీగా వర్షాలు కురిసి, లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్న తరుణంలో బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ‘రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్ధరహితం. కేటీఆర్, హరీశ్ రావులు.. రాజకీయంగా సోషల్ మీడియాలోనే బతికేస్తున్నారు. బీఆర్ఎస్ పాలకుల మాదిరిగా మేం గడీల్లో పడుకోలేదు. ప్రజల మధ్యన ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నాం. ప్రభుత్వం హై అలర్ట్ గా ఉన్నందునే స్వల్ప ప్రాణ నష్టం కూడా జరగలేదు. బీఆర్ఎస్ పాలనలో కొద్దిపాటి వర్షానికి హైదరాబాద్ మునిగిపోయేది.. జంట నగరాల్లో వరద విపత్తును ఎదుర్కోవడానికి హైడ్ ను సిద్ధం చేశాం. నిరాశ్రయులకు తక్షణమే నిత్యవసర సరుకులను పంపిణీ చేస్తున్నాం. వరద ఉధృతి తగ్గిన తర్వాత నష్టం అంచనా వేయించి బాధితులను ఆదుకుంటాం. సీజనల్ వ్యాధులు రాకుండా వైద్య ఆరోగ్యశాఖ అన్ని చర్యలు తీసుకుంటున్నది. విపత్కర సమయంలో అర్ధరాత్రి కూడా పనిచేస్తూ విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూస్తున్న విద్యుత్ సిబ్బందికి, సేవలు చేస్తున్న పోలీస్ శాఖ కు నా అభినందనలు తెలియజేస్తున్నాను’ అంటూ భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు.
Also Read: రేవంత్ సర్కారు విఫలం.. ఇదేనా ప్రజాపాలన?
భట్టి వ్యాఖ్యలపై సిద్ధిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. ‘గౌరవ ఉపముఖ్యమంత్రి గారు..! ప్రజలు ఆపదలో ఉంటే మీరు రాజకీయాలు మాట్లాడటం శోచనీయం. ప్రజల కన్నీళ్లు తుడవాల్సింది పోయి ప్రతిపక్షాల మీద విమర్శలు చేస్తున్నారు. మీలాగా మేము విమర్శలు చేయలేక కాదు. ఇలాంటి కష్టకాలంలో ప్రజలను ఆదుకోవడం ముఖ్యం. సహాయక చర్యలపై ముందు దృష్టి సారించండి. విపత్తు నిర్వహణలో, వరద బాధితులను ఆదుకోవడంలో మీరు పూర్తిగా విఫలం అయ్యారు. వారు మీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తక్షణమే సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సూచిస్తున్నాను’ అంటూ హరీశ్ రావు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
Also Read: ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత కేసీఆర్.. ఎక్కడున్నారు?: సీఎం రేవంత్ రెడ్డి
ఇదిలా ఉంటే.. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మున్నేరు పరివాహక ప్రాంతంలో ఇంత భారీ స్థాయిలో వరదను ఇదివరకెప్పుడూ నేను చూడలేదు. వరదలకు రూ. వేల కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ సాయం కోరుదామని చెప్పారు. ప్రతిపక్షాలు చేతనైతే మంచి సూచనలు, సలహాలు ఇవ్వాలి. కానీ, ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం సరికాదు’ అంటూ పొంగులేటి పేర్కొన్నారు.
ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంలో ఎప్పుడూ లేనంతగా విపత్తు సంభవించిందన్నారు. ఈ క్రమంలో మంత్రులు ఖమ్మంలో పర్యటించి వరద బాధితులకు భరోసా ఇస్తుంటే.. కేటీఆర్ అనవసర విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అమెరికాలో ఎంజాయ్ చేస్తూ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రులపై విమర్శలు చేస్తావా కేటీఆర్? అంటూ సీఎం ఫైరయ్యారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు బయటకు రాకుండా ఇంట్లో ఉన్నారంటూ మండిపడ్డారు.