– వరదలపై రేవంత్ సర్కార్ ఫెయిల్
– మేమున్నప్పుడు గంటలోనే హెలికాప్టర్ను పంపాం
– జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా నో యూజ్
– ఇదేనా ప్రజా పాలన
– సోషల్ మీడియాలో బీఆర్ఎస్ విమర్శలు
– పరిహారం తక్కువ అంటూ కేటీఆర్ ఫైర్
– 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్
భారీ వర్షాలు, వరదలు ఉమ్మడి ఖమ్మం జిల్లాను అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా ఖమ్మంలో మున్నేరు వాగు దెబ్బకు చాలామంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ను టార్గెట్ చేస్తూ విమర్శల దాడికి దిగింది బీఆర్ఎస్. సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని మండిపడింది. ‘‘జల విలయంతో ఖమ్మం విలవిల.. సహాయ చర్యల్లో కాంగ్రెస్ సర్కారు విఫలం’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది బీఆర్ఎస్. ఖమ్మంలో పలుచోట్ల వరద బాధితులు ధర్నాలు చేశారని, ప్రభుత్వ వైఫల్యంతో రోడ్డెక్కారని విమర్శించింది. ఒకనాడు గంటలోపే కేసీఆర్ హెలికాప్టర్ పంపారని, ఇప్పుడు జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా ఉపయోగం లేదని సెటైర్లు వేసింది.
‘‘సీఎం డౌన్డౌన్. రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు వెంటనే వారి పదవులకు రాజీనామాలు చేయాలి. తుమ్మల నాగేశ్వరరావు ఎక్కడున్నా వెంటనే ఇక్కడికి రావాలి. పొంగులేటి అన్నా అక్కా అంటూ తిరిగావు కదా ఇప్పుడు ఎక్కడున్నవ్? వెంటనే ఇక్కడికి రావాలి’’అంటూ ఖమ్మం ప్రజలు ఆందోళన చేపట్టారని వివరించింది. కాల్వొడ్డు, ప్రకాశ్ నగర్ వద్ద స్థానికులు, వరద బాధితులు పెద్దసంఖ్యంలో రోడ్డు మీదకు వచ్చి ధర్నా చేశారని తెలిపింది.
Also Read: రాజకీయాలకు ఇది సమయం కాదు.. కేంద్రమంత్రులు రావాలి : సీఎం రేవంత్
పరిహారంపై కేటీఆర్ ఫైర్
రాష్ట్రంలో వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేవలం రూ.5 లక్షల నష్టపరిహారం ప్రకటించడం అన్యాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. గతంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి వరదల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.25 లక్షలు అందిస్తామని చెప్పారని గుర్తు చేశారు.
‘‘ఇప్పుడు అధికారంలో ఉన్నారు. మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని రూ.25 లక్షల పరిహారం ప్రకటించండి. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే అంతకన్నా మోసం మరొకటి ఉండదు. అదే విధంగా, వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన, డ్యామేజ్ అయిన వారికి రూ.2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు సాయం చేస్తామని చెప్పారు. ఆ హామీని కూడా నెరవేర్చండి. ప్రభుత్వం అసమర్థత, చేతగానితనం, ముందస్తు ప్రణాళిక లేకపోవడం కారణంగానే ప్రాణనష్టం జరిగింది. ఇకనైనా ప్రజల ప్రాణాలు రక్షించేందుకు చర్యలు చేపట్టి వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు భరోసా కల్పించండి’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు కేటీఆర్.