CM Revanth Reddy Visiting Flood effected areas: ఎడతెరిపిలేని భారీ వర్షాల కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా అతలాకుతలమైంది. చాలా ప్రాంతాల్లో వరద ముంచెత్తింది. దీంతో వరద బాధితులు బోరున విలపిస్తున్నారు. సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇటు భారీగా వర్షాలు, అటు ఉప్పొంగుతున్న వరదలు, వాగులు, వంకలు.. తమను ఆగం చేశాయంటూ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. వరద బాధితులను వివరాలు అడిగి తెలుసుకుంన్నారు. ధైర్యం చెడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుందంటూ వారికి హామీ ఇస్తున్నారు. ఎక్కడెక్కడైతే వరద భారీగా ముంచెత్తిందో అక్కడ ఆయన పర్యటించారు.
రాజీవ్ గృహకల్పలో ఇళ్లు నీట మునగడంతో తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులకు వెంటనే రూ. 10 వేల చొప్పున సాయం అందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అదేవిధంగా ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులు అందించాలని ఆదేశించారు.
Also Read: రాజకీయాలకు ఇది సమయం కాదు.. కేంద్రమంత్రులు రావాలి : సీఎం రేవంత్
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఇది చాలా బాధాకరమైన సందర్భం. వరద మీ బతుకుల్లో తీవ్ర విషాదాన్ని తెచ్చిపెట్టింది. మంత్రులం, ప్రజాప్రతినిధులు, అధికారులమంతా మీ కోసం కష్టపడుతున్నాం. గత ఆరవై 70 ఏళ్లలో ఇంతటి భారీ వర్షాన్ని చూడలేదని చెబుతున్నారు. ఎడతెరిపిలేని ఈ భారీ వర్షాల కారణంగా రాజీవ్ గృహకల్పలో నివసిస్తున్న వందల కుటుంబాలు సర్వం కోల్పోయిన రోడ్డున పడ్డాయి. తీవ్రంగా నష్టపోయారు. ఆ ఇళ్లల్లోకి వెళ్లి చూస్తే సర్వం నీళ్లలోనే మునిగిపోయి కనిపిస్తున్నాయి. కష్టపడి సంపాదించి కొనుక్కున్నటువంటి పప్పూ ఉప్పూ మొదలుకొని అన్ని వస్తువులూ నీటమునిగాయి. వరద నీటిలో తమ పిల్లల సర్టిఫికెట్లు కూడా నానిపోయాయంటూ బాధితులు వాపోతుంటే బాధేసింది. వరదల వల్ల సర్టిఫికెట్లు పోయినవారు బాధపడొద్దు.. వారికి కొత్తవి ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం.
Also Read: ఏ ఏ జిల్లాలపై వర్ష ప్రభావం ఎక్కువగా పడింది..? ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారంటే..??
భారీ వర్షాలకు ప్రభావితమైన ప్రతి కుటుంబానికి బియ్యం, పప్పు, ఉప్పు, మంచినీరు అందించాలని కలెక్టర్ ను ఆదేశించాను. ఇళ్లు నీట మునిగిన వారిని తక్షణమే గుర్తించి వారికి రూ. 10 వేలు ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశాను. ఎవరికైనా ప్రాణనష్టం జరిగితే వారికి వెంటనే రూ. 5 లక్షలు, పశు సంపద నష్టం వాటిల్లితే వారికి రూ. 50 వేలు, గొర్రె జీవాలు చనిపోతే రూ. 5 వేల చొప్పున ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశించా. ఇల్లు దెబ్బతింటే నష్టాన్ని అంచనా వేసి వారికి కూడా ఆర్థికసాయం అందజేస్తాం. మీ కుటుంబాలకు అందుబాటులో ఉండి ఈ కష్టాల నుంచి గట్టెక్కించే బాధ్యత మాది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మీకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తారు. రెవెన్యూ సిబ్బంది ప్రతి ఇంటికీ తిరిగి ఎంత నష్టపోయారో అనేది అంచనా వేస్తారు. అధైర్య పడొద్దు.. మీకు మేమున్నాం.. ఆదుకుంటాం ధైర్యంగా ఉండండి’ అంటూ వరద బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రఘురాంరెడ్డి ఉన్నారు.