Vijayawada Floods: పోటుమీదున్న కృష్ణమ్మ.. దిగువకు లక్షల క్యూసెక్కుల నీరు విడుదల.. లోతట్టు ప్రాంతాలు జలమయం.. కట్ట తెంచుకున్న బుడమేరు.. మళ్లీ భారీ వర్షాల హెచ్చరిక.. ఇవన్నీ బెజవాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సింగ్ నగర్లోని 16 డివిజన్లు పూర్తిగా నీటమునిగాయి. 160 కి పైగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి.. లక్షమందికి పైగా వరదబాధుతులకు ఆశ్రయం కల్పించారు అధికారులు. చుట్టుపక్కల కాలేజీలు, హోటళ్లలో ఆహారం వండించి.. సప్లై చేస్తున్నారు. దుర్గగుడి వంటశాలలోనూ ఆహారం తయారు చేసి పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
మరోవైపు చిన్నపిల్లలు ఉన్నవారు పాలు దొరకక నానా ఇబ్బందులు పడుతున్నారు. తీవ్ర పాలకొరత ఉండగా.. మాకు ఒక్క పాల ప్యాకెట్ అయినా ఇవ్వండి అంటూ.. ఆహారం పంపిణీ చేసే సిబ్బందిని అడుగుతున్న దృశ్యాలు దయనీయంగా ఉన్నాయి. విజయవాడ డెయిరీ వరదలో మునగడంతో పాలప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్ల కొరత ఏర్పడింది.
Also Read: ఈ వారంలోనే మరో అల్పపీడనం.. ఆ జిల్లాలకు భారీ వర్షసూచన
ఇప్పుడు మరో విషయం బెజవాడ వాసుల్ని భయాందోళనకు గురిచేస్తోంది. అదే అమావాస్య గండం. ఈరోజు పూర్తి అమావాస్య, రేపు మిగులు అమావాస్య ఉంది. సాధారణంగా అమావాస్య, పౌర్ణమి రోజుల్లో సముద్రం, నదులు ఆటు పోటులకు గురవుతాయంటారు. ఇప్పుడదే బెజవాడ వాసుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అమావాస్య కారణంగా సముద్రం పోటు మీద ఉంది. సముద్రం పోటుమీద ఉంటే.. వరద నీటిని తనలోకి తీసుకోదంటున్నారు. ఈ క్రమంలో ఎగువ నుంచి పెరిగే వరద వచ్చింది వచ్చినట్లు సముద్రంలోకి వెళ్లే సూచనలు లేవన్న విషయం అందరినీ కలవరపెడుతోంది.
అర్థరాత్రి 12 గంటలకు అమావాస్య గడియలు ముగుస్తాయని, అప్పుడు సముద్రం పోటు తగ్గి.. వరదను తీసుకుంటుందని అంటున్నారు అధికారులు. అప్పటి వరకూ వరద పెరిగి.. 11.40 క్యూసెక్కులకు చేరితే విజయవాడ మునిగిపోతుందన్న హెచ్చరికలు భయపెడుతున్నాయి. ఇప్పటికీ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు.