CM Chandrababu Visiting Flood effected areas by JCP Vehicle: విజయవాడలో ఎడతెరిపి లేకుండా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని చాలా ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకుని అల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సహాయక చర్యలను చేపట్టింది. ఆ సహాయక చర్యలను చంద్రబాబు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆయన స్వయంగా ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు భరోసా ఇస్తున్నారు. సితార సెంటర్, జక్కంపూడిలో వరద తీవ్ర ఎక్కువగా ఉండడంతో జేసీబీపైకి ఎక్కి చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఎక్కడెక్కడా వరద ఎఫెక్ట్ పడింది అనే వివరాలు తెలుసుకుంటున్నారు. బాధితులను కలిసి ఆదుకుంటానంటూ వారికి ధైర్యం చెబుతున్నారు.
Also Read: పీకల్లోతు కష్టాల్లో బెజవాడ.. 121 ఏళ్లలో ఎన్నడూ చూడని వరద
ఇటు ప్రకాశం బ్యారేజీని కూడా సీఎం చంద్రబాబు సందర్శించారు. బ్యారేజీ గేట్ల వద్ద పరిస్థితిని ఆయన పరిశీలించారు. బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టిన ప్రాంతాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. గేట్ల మరమ్మతులకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఆయన మాట్లాడారు.
ఇదిలా ఉంటే.. విజయవాడలో వరద బాధితుల కోసం సాయం చేసేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేశారు. ఆ హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేసి తమ ఇబ్బందులను తెలపవచ్చన్నారు.
వరద బాధితులకు డ్రోన్ల ద్వారా ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. సింగ్ నగర్ ప్రాంతంలో వరద బాధితులకు డ్రోన్ల ద్వారా ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇటు మంత్రి లోకేశ్ కూడా సహాయక చర్యలపై విభాగాల వారీగా అధికారులకు బాధ్యతలను అప్పగించారు. వారికి అప్పగించిన బాధ్యతలను ఏ మేరకు పూర్తి అయ్యాయన్న అంశాన్ని ఎప్పటికప్పుడు లోకేశ్ తెలుసుకుంటున్నారు. వరద బాధితుల కోసం కృష్ణా జిల్లా వ్యాప్తంగా 81 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా వరద ముంపు ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా మెడికల్ టీమ్ లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
విజయవాడలో మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. కృష్ణా నదిలో ఇంత భారీ స్థాయిలో వరదను తానెప్పుడూ చూడలేదన్నారు. 1998 కంటే ఇప్పుడు ఎక్కువగా వరద నీరు వచ్చిందన్నారు. అనంతరం జగన్ పై మండిపడ్డారు. రాజధాని అమరావతికి ఎటువంటి ప్రమాదం లేదన్నారు. అమరావతి ముంపు ప్రాంతమనే జగన్ కలను సాకారం చేసేందుకు కొందరు కృషి చేస్తున్నారంటూ మండిపడ్డారు. పలు పేటీఎం బృందాలు, పలువురు తీవ్ర దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. 11.5 లక్షల క్యూసెక్కుల నీరు పోటెత్తినా కూడా అమరావతి ఏ మాత్రం చెక్క చెదరలేదన్నారు. అమరావతిపై వస్తున్న ఫేక్ న్యూస్ నమ్మొద్దన్నారు.
Also Read: సీఎం వచ్చినా కదలని అధికారులు.. చంద్రబాబు సీరియస్
గత ఐదేళ్ల పాలనలో బుడమేరులో లైనింగ్, ఎక్స్ టెన్షన్ పనులను చేపట్టలేదన్నారు. ఇప్పుడున్న పరిస్థితి కారణం గత ప్రభుత్వ పాలనా వైఫ్యల్యమేనన్నారు. ఈ రాత్రికి ప్రకాశం బ్యారేజ్ వద్ద మరమ్మతు పనులు చేపడుతామన్నారు. బుడమేరకు పడిన మూడు గండ్లను ఈ రాత్రికి పూడ్చుతామన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో సమర్థవంతంగా సహాయక చర్యలు అందిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు స్వయంగా వరద ప్రాంతాల్లోనే ఉండి పర్యవేక్షిస్తున్నారన్నారు. వైసీపీ నేతలను మాటలను పట్టించుకోమన్నారు. సంక్షోభ సమయాల్లో ఎలా పనిచేయాలో సీఎం చంద్రబాబుకు తెలుసు.. వైసీపీ నేతలు ప్రత్యేకంగా నేర్పాల్సిన అవసరంలేదన్నారు.