Rahul Gandhi Responded to the flood in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ కనివినీ ఎరుగని స్థితిలో వర్షాలు కుమ్మేస్తున్నాయి. దానికి తోడు వరదలు హడలు పుట్టిస్తున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందోని ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. బయటకెళ్తే వర్షాలు, ఇంట్లో ఉంటే వరదలు. దాంతో.. అసలెక్కడకు వెళ్లాలో అర్థం కాక సతమతమవుతున్నారు. వర్షాలు, వరదల బీభత్సానికి ఏళ్ల నాటి ప్రాజెక్టులు సైతం దెబ్బతింటున్నాయి. ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. అధికారులు సైతం గేట్లు ఎత్తేసి వచ్చిన నీటిని వచ్చినట్లే కిందకు వదిలేస్తున్నారు. దీంతో నదులు, ప్రాజెక్టులు, బ్యారేజీల పరివాహక ప్రాంతాల ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వరదలతో ఊరికి నడిబొడ్డున ఉన్న వాళ్ల పరిస్థితే అంతంతమాత్రంగా ఉంటే.. నదీ పరివాహక ప్రాంతాల ప్రజల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. కంటినిండా నిద్ర, కడుపునిండా తిండి లేక.. 2 రెండు రోజుల నుంచి అల్లాడిపోతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వరుణ ఉగ్రరూపానికి జనజీవనం స్తంభించింది. రోడ్,రైల్వే ప్రయాణికులపై ఆ ప్రభావం తీవ్రంగా పడింది. విజయవాడలో కుండపోతకు 130కి పైగా రైళ్లు రద్దయ్యాయి. మరో 90 రైళ్లను దారి మళ్లించారు. బుడమేరు వాగు పొంగడంతో రాయనపాడు రైల్వే స్టేషన్ నీట మునిగింది. నిన్నటి వరద ధాటికి రైళ్లు ఎక్కడికక్కడ మధ్యలోనే ఆగిపోయాయి. ప్రయాణికులను బస్సులతో తరలిస్తున్నారు.కొన్ని చోట్ల బస్సులు,రైళ్లు ఏవీ అందుబాటులో లేక బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. అధికారులు ప్రత్యేక హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశారు. అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలంటూ హెచ్చరించారు.
Also Read: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ ఫోన్
ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో వరద విలయంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ, ఏపీ ప్రజలకు ధైర్యం చెప్పారు. వరదల్లో ఆత్మీయులను కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సహాయ చర్యల్లో పాల్గొనాల్సిందిగా కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు రాహుల్. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు, పునర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని అన్నారు. విపత్తులో నష్టపోయిన వారందరినీ కేంద్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని కోరారు రాహుల్ గాంధీ.