Centre summons Netflix India’s content head: నెట్ఫ్లిక్స్ కంటెంట్ హెడ్కు ఓ వెబ్ సిరీస్ వివాదంపై సమన్లు జారీ అయ్యాయి. దేశ చరిత్రలోనే అతిపెద్ద హైజాక్గా రూపొందిన కాంధార్ హైజాక్ నేపథ్యంలో సరికొత్త వెబ్ సిరీస్ ‘ఐసీ 814: కాంధార్ హైజాక్’ రూపొందింది. అయితే ఈ సిరీస్ పై ఇటీవల సోషల్ మీడియా వేదికగా వివాదం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా జరుగుతున్న ఈ వివాదం కాస్త పెద్దగా మారింది. హైజాకర్ల పేర్ల విషయంలో తీవ్ర చర్చ నడుస్తోంది.
ఈ నేపథ్యంలో కేంద్ర సమాచారం, ప్రసార మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. ఈ మేరకు నెట్ఫ్లిక్స్ ఇండియా హెడ్కు సమన్లు జారీ చేసినట్లు అధికారిక వర్గాల సమాచారం. హైజాకర్ల పేర్లను ఉద్దేశించి సోషల్ మీడియాలో వివాదం నెలకొన్న నేపథ్యంలో సమన్లు జారీ చేసినట్లు.. ఈ వివాదానికి దారితీసిన అంశాలపై మరింత వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
కాగా, విజయ్ వర్మ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘ఐసీ 814: ది కాంధార్ హైజాక్’. ఈ సిరీస్ ను అతిపెద్ద హైజాక్గా పేరుపొందిన కాంధార్ హైజాక్ నేపథ్యంలో రూపొందించారు. కెప్టెన్ దేవిశరణ్, శ్రింజయ్ చౌదరి రాసిన పుస్తకం ‘ఫ్లైట్ ఇన్ టూ ఫియర్’ ఆధారంగా తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ లో పలు సన్నివేశాలను అనుభవ్ సిన్హా ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. ఈ సిరీస్ ఆగస్టు 29న విడుదల చేశారు.
Also Read: పవన్ కల్యాణ్కు బర్త్ డే విషెస్ చెబుతూ బన్నీ ట్వీట్
కథ విషయానికొస్తే.. 1999లో దాదాపు 176 మంది ప్రయాణికులతో ఖాట్మాండు నుంచి ఢిల్లీకి బయలుదేరిన ‘ఐసీ 814’ను ఐదుగురు ఉగ్రవాదులు హైజాక్ చేస్తారు. ఇందులో ఇబ్రహీం అథర్, సన్నీ అహ్మద్ ఖాజీ, జహుర్ ఇబ్రహీం, షాహిద్ అక్తర్, సయ్యద్ షకీర్లు కెప్టెన్ తలపై తుపాకీ పెట్టి బెదిరించి విమానాన్ని కాబూల్కు తీసుకెళ్తారు.
ఇదిలా ఉండగా, సిబ్బందితోపాటు ప్రయాణికులను ఎనిమిది రోజులు బందీలుగా ఉంచారు. తర్వాత డిమాండ్ మేరకు హార్డ్ కోర్ టెర్రరిస్టులు మసూద్ అజార్, ఒమర్ షేక్, ముస్తాక్ అహ్మద్ జర్గర్ లను విడుదల చేయడంతో అందరినీ వదిలేస్తారు. అప్పటి విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ వారిని ప్రత్యేక విమానంలో కాందహార్ కు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.