CM RevanthReddy: వినాయక చవితి ముందు భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించాయి. తెలంగాణ అంతటా తీవ్రనష్టాన్ని మిగిల్చింది. వాతావరణ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న రేవంత్ సర్కార్, ఇప్పటివరకు జరిగిన నష్టంపై సమీక్షా సమావేశం నిర్వహించింది.
సోమవారం ఉదయం సచివాలయంలో మంత్రులు, అధికారులతో కలిసి వరదల కారణంగా జరిగిన నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి. తొలుత వాతావరణ పరిస్థితులపై సంబంధిత అధికారులు తెలిపారు. వివిధ జిల్లాల్లో జరిగిన నష్టం గురించి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఎంత మేరా నష్టం జరిగింది? ఏయే ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి? పంట పరిస్థితి ఏంటి? పంట నష్టం వాటిల్లిన ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి. భారీ వర్షాలున్న చోట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాల్లోని కలెక్టరేట్లలో కాల్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్ వ్యవస్థ సన్నద్ధంగా ఉండాలన్నారు ముఖ్యమంత్రి. భారీ వర్షాల వేళ అత్యవసర సేవల కోసం పోలీసులకు శిక్షణ ఇవ్వాలన్నారు. 8 పోలీసు బెటాలియన్లకు ఎన్డీఆర్ఎఫ్ తరహా శిక్షణ ఇవ్వాలన్నారు.
ALSO READ: ఏపీ, తెలంగాణలో వర్షాలు.. 21 రైళ్లు రద్దు.. 10 ట్రైన్స్ దారి మళ్లించిన సౌత్ సెంట్రల్ రైల్వే
వరదల వల్ల చనిపోయిన బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని పెంచారు. ఇప్పటివరకు నాలుగు లక్షలు ఇస్తుండగా, దాన్ని ఐదు లక్షలకు పెంచారు. దీనిపై ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకు జరిగిన నష్టంపై అధికారులు తక్షణమే స్పందించాల న్నారు. అలాగే వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెలకు పరిహారం పెంచాలన్నారు.
వరద నష్టంపై కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం. ఖమ్మం, భద్రాద్రి, మహూబూబాబాద్, సూర్యాపేట్ జిల్లాలకు తక్షణ సాయం కింద ఐదు కోట్లు విడుదల చేయనున్నా రు. వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని సీఎస్ శాంతి కుమారిని ఆదేశించారు. వరద ముంపు ప్రాంతాల్లో ప్రధాని పర్యటించాలని అందులో ప్రస్తావించారు.
గతంలో ఐదు లేదా పదేళ్లకొకసారి ఇలా ఊహించని రీతిలో భారీ వర్షాలు కురిసేవని, కానీ.. ఇటీవల కాలంలో తరచూ ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు వర్షాలు కురవడానికి గల కారణాలపై సీఎం ఆరా తీశారు. అయితే దీనిపై అధ్యయనం చేస్తున్నామని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. నేడు, రేపు ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాల కలెక్టర్లు అన్నివిభాగాల అధికారులతో సమన్వయం చేసి.. సిబ్బందిని అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సహాయక శిబిరాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి 24 గంటలూ పర్యవేక్షణ కొనసాగించాలని సీఎం సూచించారు.
జీహెచ్ఎంసీ కమిషనరేట్ల పరిధిలో.. నగరంలో ఎక్కడా చిన్న అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోవడానికి వీల్లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యుత్, ట్రాఫిక్, తాగు నీరు, శానిటేషన్ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్ను నిరంతరం పర్యవేక్షించాలని, విద్యుత్ సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయ శిబిరాలను తరలించాలని సూచించారు. రోజువారీ కూలీ కుటుంబాలను గుర్తించి నిత్యావసర వస్తువులను అందించాలని ఆదేశించారు.
117 గ్రామాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తోంది. వరద ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు సీఎం. ఖమ్మం ప్రాంతాంలో ముప్పు ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేస్తోంది ప్రభుత్వం. మరికాసేపట్లో రోడ్డు మార్గం ద్వారా ఖమ్మం జిల్లాలో వరద ప్రాంతాలను పరిశీలించనున్నారు సీఎం రేవంత్రెడ్డి.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, ఇప్పటి వరకు జరిగిన నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.
సహాయక చర్యలపై ఆరా తీసిన సీఎం.
సమీక్షలో పాల్గొన్న మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ… pic.twitter.com/7vECvqi8CU
— BIG TV Breaking News (@bigtvtelugu) September 2, 2024