Bihar : బీహార్ లోని…ఛాప్రా నకిలీ మద్యం ఘటనలో మరణించిన వారి సంఖ్య 39కి పెరిగింది. దీనిపై అసెంబ్లీ సహా పార్లమెంట్ లో విపక్ష నేతలు మండిపడ్డారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటు కల్తీ మద్యం తీసుకున్న అనేక మంది ఆసుపత్రుల్లో చికత్స పొందుతున్నారు.
సరన్లోని మష్రక్, ఇసువాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. జిల్లా యంత్రాంగం అధికారుల బృందాలను ఏర్పాటు చేసింది. వారంతా ప్రభావితగ్రామాల్లో పర్యటించి.. అక్రమ మద్యం సేవించిన వారిని గుర్తించేపనిలో పడ్డారు.
కల్తీ మద్యం మరణాలపై సీఎం నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు మద్యం తాగుతారో… వారు చనిపోతారంటూ వ్యాఖ్యానించారు. మద్య నిషేధం లేని రోజుల్లో కూడా ఇక్కడ కల్తీ మద్యం తాగి జనం చనిపోయినట్లు సీఎం తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనలు జరిగాయన్నారు. మద్యం మంచిది కాదని, ఎవరూ తాగకూడదని సీఎం నితీశ్ అన్నారు.
ఛాప్రాలో జరిగిన ఘటనపై.. రాష్ట్ర అసెంబ్లీని విపక్షాలు వణికించాయి. అసెంబ్లీ ప్రాంగణం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను.. ప్రతిపక్ష నేతలు అడ్డుకునేందుకు యత్నించారు. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. వారిని సముదాయించుకుంటూ సీఎం.. అసెంబ్లీకి వెళ్లారు. అసెంబ్లీలోనూ విపక్షాలు.. ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేయటం సహా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నినదించారు.
ఘటనపై పార్లమెంటులోనూ చర్చ జరిగింది. ఘటనకు సంబంధం ఉన్న అధికారులు, సిబ్బందిపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ.. బీహార్ ఎంపీలు నినదించారు. ఇప్పటికే మస్రఖ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రితేష్ మిశ్రా, కానిస్టేబుల్ వికేష్ తివారీలను సస్పెండ్ చేయగా… మర్హౌరా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ యోగేంద్ర కుమార్పై శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేశారు.