– వర్షాలతో జనం చస్తుంటే ఇంట్లో ఉంటారా?
– ఢిల్లీకి మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్తారు
– ప్రజా సమస్యలపై మాత్రం నోరెత్తరు
– వర్షాలపై ముందస్తు చర్యల్లో ప్రభుత్వం ఫెయిల్
– మంత్రులపై బీఆర్ఎస్ నేతల విమర్శలు
Heavy Rains: భారీ వర్షాల నేపథ్యంలో జనం ఇబ్బందులు పడుతున్నారు. చాలా గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే, వర్షాలపై ముందస్తు చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, కాంగ్రెస్ మంత్రులు ప్రతిపక్షాలను విమర్శించే సమయాన్ని పరిపాలనపై పెడితే బాగుంటుందని హితవు పలికారు. అసలు, వాళ్ళకి ప్రజా సమస్యలపై సోయి లేదంటూ మండిపడ్డారు. ఢిల్లీకి మాత్రం నలుగురు మంత్రులు కలిసి వెళ్తారు కానీ, వర్షాలు, వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఒక్క మంత్రి కూడా బయటికి రాకపోవడం శోచనీయమన్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ మాట్లాడుతూ, భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే మంత్రులు ఏం పట్టనట్టు ఉన్నారని మండిపడ్డారు. వారం రోజుల నుండి వాతావరణ శాఖ హెచ్చరిస్తోందని, అయినప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
Also Read: CM Chandrababu: అప్పటివరకు ఈ కలెక్టరేట్లోనే ఉంటా.. ఏం తమాషా చెస్తున్నారా? : సీఎం చంద్రబాబు
ప్రజలు, విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే నాయకులు ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. హాస్టల్స్లో పిల్లలు ఎలుకల దాడిలో గాయపడుతున్నారని, కేసీఆర్ క్షేస్థాయిలో పర్యటనకు వస్తారు అనగానే మంత్రులు వణికి పోతున్నారని సెటైర్లు వేశారు. కేసీఆర్ బయటికి వస్తే మంత్రుల సీట్లకు ఎసరు వస్తుందని, ప్రజా క్షేత్రంలోకి ఆయన వస్తున్నారని అనగానే, ఏ ముఖం పెట్టుకుని వస్తారని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని ఎద్దేవ చేశారు. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అని ప్రతి ఒక్కరు అంటున్నారని చెప్పారు. రాష్ట్రం వచ్చింది అంటే కేసీఆర్ కృషి వల్లే సాధ్యమని ఆనాడు రేవంత్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. 420 హామీలు, 6 గ్యారెంటీలు అడగడానికి కేసీఆర్ వస్తారు అంటే భయమెందుకని ప్రశ్నించారు. కొత్త పెన్షన్ కాదు ఉన్న పెన్షన్ డబ్బులు ఎగ్గొడుతున్నారని, మంత్రులు ఉన్నది ప్రజల సమస్యలు తీర్చడానికి కాదు తిట్టడానికి మాత్రమేనని విమర్శించారు వివేకానంద.