ఏపీలో గత రెండు రోజుల నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్లు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. పలు ప్రాంతాలను పూర్తిగా వరద నీరు ముంచెత్తుతోంది. ఈ క్రమంలో బాధితులు తీవ్ర భయాందోళనను వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు, విజయవాడలో కూడా భారీగా వర్షం కురుస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా విజయవాడలో వర్షం కురుస్తోంది. భారీగా వస్తున్న వరద నీరు కారణంగా విజయవాడలోని బుడమేరు వాగు కూడా పొంగిపొర్లుతున్నది. నగరంలోకి బుడమేరు వరద వచ్చి చేరడంతో స్థానిక ప్రజలు నిరాశ్రాయులవుతున్నారు. తమను కాపాడండంటూ కంటతడి పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఆ వరద ప్రాంతాల్లో ఆదివారం పర్యటించారు. అనంతరం విజయవాడ కలెక్టరేట్ లో ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
Also Read: ఏపీలో వింత.. వెనక్కి ప్రవహిస్తున్న వాగు
ఈ సందర్భంగా అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బుడమేరు వరద ప్రాంతాల్లో పరిస్థితిని వివరించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారంటూ ఫైరయ్యారు. బుడమేరు వరద బాధితుల కష్టాలు తీర్చే వరకు తాను విశ్రమించేదిలేదన్నారు. అప్పటివరకు తాను ఈ కలెక్టరేట్ లోనే ఉంటానన్నారు. వరద బాధితుల కోసం పాలు, ఆహారం, తాగునీరు, కొవ్వొత్తులు, టార్చ్ లు వెంటనే ఇతర ప్రాంతాల నుంచి తెప్పించాలని అధికారులను ఆదేశించారు. లక్ష మందికి సరిపోయేంతగా ఆహారం తెప్పించి బాధితులకు సరఫరా చేయాలన్నారు. అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి అదనపు బోట్లను, ట్రాక్టర్లను, సహాయం చేసేందుకు అవసరమైన వస్తువులను తెప్పించాలంటూ ఆయన అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా వరద ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలన్నారు. ప్రస్తుతమైతే వెంటనే అందుబాటులో ఉన్న ప్యాక్డ్ ఫుడ్ ను బాధితులకు అందించాలన్నారు. వరద ప్రాంతాల నుంచి వృద్ధులు, చిన్నారులను వెంటనే తరలించాలన్నారు. విజయవాడలో ఉన్న అన్ని దుకాణాల నుంచి వాటర్ బాటిల్స్ తెప్పించాలని అధికారులను ఆదేశించారు.
Also Read: వర్షాల వల్ల ఇప్పటివరకు ఏపీలో ఎంతమంది చనిపోయారంటే..? వివరాలు వెల్లడించిన చంద్రబాబు
‘బుడమేరులో ఊహించని స్థాయిలో వరద నీరు వచ్చి చేరింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్క బాధితుడికి సహాయం అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. సహాయక చర్యలను ముమ్మరం చేయాలి. సాయంలో ప్రతి రెండు గంటలకు నాకు మార్పు కనిపించాలి. సరఫరా చేయగలిగిన ఏజెన్సీల నుంచి ఆహారం తెప్పించి బాధితులకు అందజేయాలి. అదేవిధంగా నగరంలో ఉన్న అన్ని దుకాణాల నుంచి బిస్కెట్ ప్యాకెట్లు, పాలు తెప్పించి బాధితులకు ఇవ్వండి. ఖర్చు గురించి మీరు అసలే ఆలోచన చేయకండి’ అంటూ మంత్రులు, అధికారులకు చంద్రబాబు బాధ్యతలు అప్పజెప్పి పంపించారు. నిముషాల లెక్క అప్పగించిన బాధ్యతలను నెరవేర్చాలంటూ వారిని ఆదేశించారు. విజయవాడలో సాధారణస్థితి వచ్చేంతవరకు తాను కలెక్టరేట్ నుంచి అడుగు బయటకు పెట్టబోనన్నారు. దీంతో విజయవాడ కలెక్టరేట్ కాస్త.. ప్రస్తుతం సీఎం తాత్కాలిక కార్యాలయంగా మారింది. సీఎం ఇక్కడే ఉండి పరిస్థితిని సమీక్ష చేస్తానంటూ సీఎం పేర్కొనడంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.