– ఫ్యాన్లు లేవు.. కిటికీలకు దోమ తెరలు లేవు
– స్కూలుకు జనరేటర్ లేదు
– ఇప్పటి దాకా దుప్పట్లు రాలేదు
– బూట్లు, నైట్ డ్రెస్సులు ఇవ్వలేదు
– అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?
– దేవరకొండ గురుకుల స్కూల్ పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు
Welfare Hostels: గురుకుల పాఠశాలల్లో వరుస ఘటనల నేపథ్యంలో ప్రభుత్వంపై బీఆర్ఎస్ విమర్శల దాడికి దిగింది. నల్గొండ జిల్లా దేవరకొండ గురుకుల స్కూల్లోని విద్యార్థులను ఎలుకలు కరిచాయి. ఆదివారం బాధిత విద్యార్థులను పరామర్శించారు బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, గాదరి కిశోర్, ఇతర నేతలు. వారితో మాట్లాడిన నేతలు, వివరాలు అడిగి తెలుసుకున్నారు. గురుకుల పాఠశాలలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో ఉందని విమర్శలు చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ దీనిపై మాట్లాడుతూ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రులతో కలిసి దేవరకొండ బీసీ గురుకుల పాఠశాలలో ఎలుకల దాడిలో గాయపడ్డ విద్యార్థులను పరామర్శించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా స్కూల్లో తాము చాలా విషయాలను గమనించినట్టు చెప్పారు.
‘‘చాలా డార్మిటరీలలో ఫ్యాన్లు లేవు. కిటికీలకు దోమ తెరలు లేవు. కరెంటు పోతే దోమల బెడద. స్కూలుకు జనరేటర్ లేదు. డిస్పెన్సరీలో మినీ రెఫ్రిజిరేటర్ లేదు. పిల్లలకు ఇప్పటి దాకా దుప్పట్లు రాలేదు. బూట్లు రాలేదు. నైట్ డ్రెస్సులు లేవు. స్పోర్ట్స్ డ్రెస్సు లేదు. ఒకటే జత యూనిఫాం ఇచ్చారు. గెస్ట్ ఫ్యాకల్టీకి జీతాలు లేవు. రూ.37 తోనే అన్నీ సర్దుకోమంటున్నారు. చాలా చోట్ల ఇంటర్ ఫ్యాకల్టీ పూర్తిగా లేదు. బడ్జెట్ ఇంకా విడుదల కాలేదు. తిండి కోసం ఖైదీలకు రోజుకు రూ.83, ఆసుపత్రుల్లో రోగులకు రూ.71 ఖర్చు పెడుతున్న ప్రభుత్వం, విద్యార్థులకు మాత్రం రూ.36.75 మాత్రమే కేటాయించింది’’ అని విమర్శలు చేశారు.
Also Read: HYDRA: సీఎం రేవంత్ రెడ్డి సాహసోపేత నిర్ణయం ఇప్పటికైనా అర్థమైందా?: జనసేన
పెరిగిన రేట్లకు అనుగుణంగా డైట్ చార్జీలనూ పెంచాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్. ఇప్పటి వరకు తెలంగాణకు విద్యాశాఖ మంత్రి లేరని, ఎస్సీ సంక్షేమ శాఖా మంత్రి, గిరిజన సంక్షేమ మంత్రి, మైనారిటీ సంక్షేమ మంత్రి లేరని చెప్పారు. దాదాపు కోటి మంది విద్యార్థులు అనాథలు కాకపోతే ఏమవుతారని ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్.