AP CM Chandrababu: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నామని, ప్రజల ప్రాణాలు కాపాడటమే తమ ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీలో ఎడతెరిపిలేని వర్షాలు, వరద పరిస్థితుల నేపథ్యంలో విపత్తు నిర్వహణ కార్యాలయంలో ఆదివారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడారు.
‘ఏపీలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నాం. వర్షాలు, వరదల కారణంగా ఏపీలో ఇప్పటివరకు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకరు గల్లంతయ్యారు. కొండచరియలు విరిగిపడటం, కారులో చనిపోవడం, వాగులో కారు కొట్టుకుపోయి ముగ్గురు చనిపోవడం చాలా బాధాకరం. గుంటూరు, విజయవాడలో 37 సెంటీమీటర్ల వర్షం కురవడం అసాధారణం. అందువల్ల అక్కడ ముంపు ప్రాంతాల సంఖ్య పెరిగింది. కాజా టోల్ గేట్, జగ్గయ్యపేటలో ముంపు ఎక్కువగా జరిగింది. ఎక్కడెక్కడైతే వరద ముంచెత్తిందో అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Also Read: భారీ వర్షాలు.. మరో వయనాడ్ గా విజయవాడ
పులిచింతల నుంచి ప్రవాహం ఎక్కువగా వస్తున్నది. ప్రకాశం బ్యారేజీకి 8.8 లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్నది. బుడమేరు వల్ల వీటీపీఎస్ లో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ప్రకాశం బ్యారేజీ కింద పలు చోట్ల గట్లు బలహీనంగా ఉన్నట్లు తెలిసింది. ఎక్కడెక్కడైతే గట్లు బలహీనంగా ఉన్నాయో అక్కడ ఇసుక బస్తాలను వేస్తున్నాం. ఇటు పంటలు కూడా బాగా దెబ్బతిన్నాయి ఈ వర్షాల కారణంగా. రాష్ట్ర వ్యాప్తంగా 107 క్యాంపులను ఏర్పాటు చేసి, 17 వేలమందిని ఇప్పటివరకు తరలించాం. ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. వరదముంపు ప్రాంతాలకు బోట్లును సైతం పంపించాం. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తూనే ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు రాకుండా చర్యలు చేపడుతాం. ప్రజల ప్రాణాలను కాపాడడమే మా ప్రస్తుత కర్తవ్యం. వరద ప్రాంతాల్లో బియ్యం, నూనె, ఉప్పు, కూరగాయలు, పంచాదర, పప్పు వంటి సరుకులను కూడా పంపిణీ చేస్తున్నాం. మత్స్యకారుల కుటుంబాలకు 50 కిలోల బిస్సం బస్తాను ఇస్తున్నాం. రోడ్లపై నీరు నిల్వకుండా చర్యలు చేపడుతున్నాం. సాధారణ పరిస్థితులు నెలకొనేంతవరకు యుద్ధప్రాతిపదికన చర్యలు కొనసాగుతాయి. వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం. ఇటు పంటలు నష్టపోయిన రైతులను కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది.
Also Read: మాజీమంత్రి పేర్నినాని కారుపై దాడి.. పరిస్థితి ఉద్రిక్తం
అనంతరం గుడ్లవల్లేరు ఘటనపై చంద్రబాబు మాట్లాడుతూ.. గుడ్లవల్లేరు కాలేజీ ఘటనపై విచారణ ఇంకా కొనసాగుతున్నది. ఆడపిల్లల రక్షణకు కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. రాష్ట్రమంతా ఏదో జరిగిపోయిందంటూ వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అలా చేయడం సరికాదు. ఆడబిడ్డలపై దుష్ర్పచారం చేయడం ఎంతవరకు మంచిది? ఇప్పటికైనా ఇలాంటి పనులను వైసీపీ నేతలు మానుకోవాలి. గుడ్లవల్లేరు ఘటనపై ఎవరివద్ద ఆధారాలున్నా వారు పోలీసులకు ఇవ్వాలి. అనుమానం ఉన్నవారి ఫోన్లు, కంప్యూటర్లు తనిఖీ చేస్తాం. ఈ కేసులో ఢిల్లీ సాంకేతిక నిపుణుల సాయం తీసుకుంటున్నాం’ అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.