Floods in Khammam: రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా తెలంగాణ అతలాకుతలమైతున్నది. కుండపోత వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. ఖమ్మం నగరంలో వరద బీభత్సం సృష్టిస్తున్నది. పలు కాలనీలు జలాశయాలుగా మారిపోయాయి. కాలనీల్లోని ఇళ్లు పూర్తిగా నీటమునిగాయి. వెంకటేశ్వర నగర్ కాలనీ, గణేష్ నగర్ కాలనీ, రాజీవ్ గృహకల్ప కాలనీతోపాటు పలు పలు కాలనీలను మున్నేరు వరద నీరు పూర్తిగా ముంచెత్తుతోంది. ఈ నేపథ్యంలో స్థానికులు తమను కాపాడాలంటూ వరద నీరు చుట్టుముట్టిన ఇళ్ల నుంచి బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. ఇంటిపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. సంబధిత అధికారులను అలర్ట్ చేశారు. వెంటనే అక్కడికి వెళ్లి బాధితులను సరక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా ఆదేశించారు. బాధితులను కాపాడేందుకు హెలికాప్టర్ ను పంపించాలంటూ ఇటు సీఎస్ ఆయనకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read: మీ సెలవులను రద్దు చేస్తున్నా : మంత్రి ఉత్తమ్
కూసుమంచిలో విషాదం.. దంపతులు గల్లంతు
కూసుమంచి మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మండలంలోని వాయకన్ గూడెంకు చెందిన దంపతులు పాలేరు వాగులో చిక్కుకుని గల్లంతయ్యారు. ఇదేవాగులో కొట్టుకుపోతున్న మరో యువకుడిని స్థానికులు గుర్తించి రక్షించారు. అయితే, పాలేరు అలుగు జలాశయానికి దగ్గరలో ఉన్న ఓ సిమెంట్ ఇటుకల తయారీ కర్మాగారంలో ఓ కుటుంబం నివసిస్తున్నది. ఆదివారం తెల్లవారుజాము నుంచి పాలేరు జలాశయానికి వరద నీరు పోటెత్తుతున్నది. ఈ క్రమంలో దంపతులిద్దరు, వారి కొడుకు వరదల్లో చిక్కుకుపోయారు. వరద ఉధృతి పెరగడంతో నీటి ప్రవాహంలో వారు గల్లంతయ్యారు. కొట్టుకుపోతున్న ఆ యువకుడిని స్థానికులు కాపాడారు. దంపతుల ఆచూకీ ఇంకా లభించలేదు.
Also Read: మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి కంటతడి
ఇదిలా ఉంటే.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మీడియా సమావేశంలో కంటతడి పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటుకలు తయారీ చేసే ఓ కూలీ కుటుంబం వరదలో కొట్టుకుపోయిందని ఆయన వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. రెస్క్యూ టీం వారిని కాపాడేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నదంటూ మంత్రి చెప్పుకొచ్చారు. అయితే, వారి కొడుకును మాత్రమే రెస్క్యూ టీం కాపాడగలిగిందని, దంపతుల ఆచూకీ గాలిస్తున్నామంటూ ఆయన చెప్పుకొచ్చారు. వారిద్దరు కూడా బ్రతికి బయటపడాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. అయితే, వారిని కాపాడేందుకు హెలికాప్టర్ కోసం కూడా ప్రయత్నం చేశామన్నారు.. కానీ, వాతావరణం సహకరించని కారణంగా ఆ ప్రయత్నం సఫలం కాలేకపోయిందన్నారు మంత్రి. ఆ వివరాలు వెల్లడిస్తూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. అయితే, వారితో మాట్లాడినప్పుడు ఆ తల్లి రోధించిందని మంత్రి చెప్పారు. తాము మరికాసేపట్లో చావబోతున్నామనే బాధ వారి గొంతులో వినిపించిందని, ఆ బాధ వర్ణనాతీతమంటూ మంత్రి కంటతడిపెట్టారు. వారు ఖచ్చితంగా రెస్క్కూ టీంకు దొరుకుతారంటూ మంత్రి పొంగులేటి ఆశాభావం వ్యక్తం చేసిన విషయం విధితమే.