Minister Uttam Review meeting with Officials: భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఏఈల నుంచి సీఈల వరకు క్షేత్ర స్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అదేవిధంగా భారత వాతావరణ శాఖ తెలంగాణలో రెడ్ అలెర్ట్ ప్రకటించిన నేపథ్యంలో నీటిపారుదల శాఖ సిబ్బందికి సెలవులను రద్దు చేసినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో సంభవిస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నీటిపారుదల శాఖాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, సహాయ కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీలు అనిల్ కుమార్, నాగేందర్ రావు, హరేరాం, శంకర్ డిప్యూటీ ఈఎన్సీ శ్రీనివాస్ లతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీఈలు, ఎస్ఈలు ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. చెరువుల డ్యామేజీలను ఎప్పటికప్పుడు అధికారులు గుర్తించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులను చేపట్టాలని సూచించారు. విపత్తుల సమయంలో నిధుల గురుంచి ఆలోచన చేయవద్దన్నారు. ప్రజాభద్రతలో అప్రమత్తంగా ఉండాలని ఆయన వారికి సూచించారు. అదేవిధంగా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లాల వారీగా సీఈలు, ఎస్ఈలతో ఆయన మాట్లాడుతూ ఆయా జిల్లాల పరిస్థితులను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.
Also Read: కోదాడలో బీభత్సం సృష్టిస్తున్న వర్షం .. వరదలో కొట్టుకొచ్చిన 2 మృతదేహాలు
నల్లగొండ జిల్లాలో ఇప్పటికే డిండి ప్రాజెక్టులో ఆరు ఫీట్ల మేర నీరు చేరిందని ఆ జిల్లా సీఈ అజయ్ కుమార్ మంత్రి దృష్టికి తీసుకురాగ ఉదయసముద్రం నిండేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఉత్తమ్ సూచించారు. నాగార్జున సాగర్ కు ఇన్ఫ్లో 5 లక్షల క్యూసెక్కులు వస్తుండగా, ఔట్ ఫ్లో 4.70 లక్షల క్యూసెక్కులుగా ఉందని ఆయన మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సాగర్ నుండి పాలేరు రిజర్వాయర్ కు నీటిని నిలిపివేశారు. అయితే అప్పటికే వర్షపు నీటితో పాలేరు రిజర్వాయర్ నిండిపోవడంతో చేరిన బ్యాక్ వాటర్ తో 132 కిలో మీటర్ల వద్ద, 133.06 కిలో మీటర్ల వద్ద గండి పడినట్లు అధికారులు మంత్రి ఉత్తమ్ దృష్టికి తీసుకొచ్చారు.
అదేవిధంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని పెద్దదేవులపల్లి రిజర్వాయర్ కు సాగర్ నుండి వస్తున్న నీటిని నిలిపివేసినప్పుటికీ కేవలం వరద నీరే 3,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందని, అయితే ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు మంత్రికి వివరించారు తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి, చింతలపాలెం, హుజూర్ నగర్ మండలాల్లో తాజా వర్షాలకు దెబ్బతిన్న చెరువుల మరమ్ముతులు వెంటనే చేపట్టాలని సూర్యాపేట జిల్లా సీఈ రమేష్ బాబును ఆయన ఆదేశించారు.
Also Read: వాయుగుండం ఎఫెక్ట్.. విషాదాన్ని మిగులుస్తున్న భారీ వర్షాలు!
వరంగల్ జిల్లా కేసముద్రం ప్రాంతంలో రైల్వే ట్రాక్ ను ఆనుకుని ఉన్న చెరువులు దెబ్బతిన్నాయని అధికారులు మంత్రికి వివరించగా, తక్షణమే మరమ్మతులు చేపట్టాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అంతేగాకుండా రెడ్ అలెర్ట్ ప్రకటించిన ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు చెరువులను, కెనాల్స్ ను, స్పిల్ వేలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. డ్యామ్ లు, కెనాల్స్ కట్టలపై దృష్టి సారించి ప్రమాదకర సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు సూచించారు.
కాగా, సూర్యాపేట జిల్లాలో వర్ష ఉధృతి కారణంగా దెబ్బతిన్న కోదాడ, హుజూర్ నగర్ లలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం పర్యటించనున్నారు.