గత కొన్ని రోజులు నుంచి విజయవాడలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి వర్షాలు.. బెజవాడలో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది న భూతో అనే చెప్పాలి. ఇక భారీ వర్షాలకు సున్నపు బట్టీల సెంటర్ వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కొండలు ఉన్న ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. దుర్గగుడి ఘాట్ రోడ్డుతో పాటు.. దుర్గగుడి ఫ్లై ఓవర్ను కూడా మూసేశారు. ముందు జాగ్రత్తగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేశారు. ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప అస్సలు బయటికి రావొద్దని చెబుతున్నారు అధికారులు.. విజయవాడ మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. దాంతో విశాఖలోని నగరంలోని కొండవాలు ప్రాంతాల్లో నివాసితులు ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కొండవాలులో రాళ్లు, మట్టిపెళ్లలు జారి పడుతున్నాయి.
ఆఖరికి రోడ్డుపై బైక్ను కూడా అనుమతించడం లేదు. బెజవాడలోనే అత్యంత ఎత్తైన ప్రాంతాల్లోనే మోకాళ్ల లోతులో నీరు ఉంది. అంటే లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. అయితే ఇందుకు ప్రకృతి ప్రకోపం ఎంత కారణమో.. అధికారుల నిర్లక్ష్యం కూడా అంతే కారణమనిపిస్తోంది. చాలా చోట్ల డ్రైనేజీలు బ్లాక్ అయ్యాయి. దీంతో నీరు బయటికి వెళ్లడం లేదు. దీనికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటున్నారు బెజవాడ వాసులు.. మరికొన్ని చోట్ల డ్రైనేజీలు ఆక్రమణకు గురయ్యాయంటున్నారు. ఇప్పుడు డ్రైనేజీ వాటర్ అంత ఇళ్లలోకి వస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఏపీపై కన్నెర్ర చేసిన వరుణుడు.. ఏడుగురు మృతి.. 20 రైళ్లు రద్దు
బెజవాడ, గుంటూరు ఏరియాల్లో కురుస్తున్న అతి భారీ వర్షం వాహనదారులకు కూడా చుక్కలు చూపిస్తోంది. ప్రస్తుతం భారీ వర్షం కారణంగా వాహనాలు సిటీలోపలికి వచ్చే పరిస్థితి లేదు. మంగళగిరి టోల్ ప్లాజ్ అయితే మొత్తం మునిగిపోయింది. నేషనల్ హైవేస్ నుంచి వాహనాలను సర్వీస్ రోడ్డులోకి మళ్లీస్తున్నారు. మెయిన్ జంక్షన్స్లో ఫైర్ ఇంజిన్స్తో నీళ్లను తొలగించే ప్రయత్నం చేశారు. అయితే మరో రెండు రోజుల పాటు ఇలానే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
దివిసీమకు మళ్లీ వరద ముప్పు ముంచి ఉన్నట్టు కనిపిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీలో వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో సముద్రంలోకి నీటిని విడుల చేస్తున్నారు. దీంతో లంకగ్రామాల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ప్రజలకు సూచించారు అధికారులు. ఇప్పటికే కొన్ని గ్రామాలకు వరద హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ వర్షం, వరద ముప్పు త్వరలో ముగుస్తుందా? అంటే లేదనే చెబుతున్నారు అధికారులు.. ఎందుకంటే ఈ వర్షాలు మరో రెండు రోజులు కురుస్తాయి. అప్పటి వరకు ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవడం తప్ప చేసేదేం లేదు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అయితే రియాక్ట్ అయ్యింది. ప్రజలకు అవసరమైన సహాయం అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.