Heavy Rainfall in Telangana: తెలంగాణలో భారీగా కురుస్తున్న వర్షాలు కొన్ని కుటుంబాల్లో విషాదాన్ని మిగుల్చుతున్నాయి. నారాయణపేటలో వర్షాల కారణంగా ఇల్లు కూలి ఇంట్లో నిద్రిస్తున్న తల్లికూతురు మృతి చెందగా.. ఖమ్మం జిల్లాలో తండ్రికూతురు గల్లంతయ్యారు.
నారాయణపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మద్దూరు మండలం ఎక్కమేడు గ్రామంలో ఇళ్లు కూలి తల్లీకూతురు మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు శనివారం రాత్రి ఇల్లు కూలిందని చెబుతున్నారు.
గ్రామానికి చెందిన హనుమమ్మ(75), కూతురు అంజిలమ్మ(38) ఇంట్లో పడుకున్నారు. వర్షానికి తడిసిన ఇల్లు కూలడంతో ఇద్దరు మృతి చెందారు. భర్త చనిపోవడం అంజిలమ్మ తల్లి దగ్గరే ఉంటుందని స్థానికులు చెప్పారు. అయితే ఘటనాస్థలంలో మృతుల బంధువుల రోదనలు కన్నీరు పెట్టిస్తున్నాయి.
అలాగే, ఖమ్మం జిల్లాలో మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో ఓ కారు కొట్టుకుపోయింది. అయితే ఈ కారులో హైదరాబాద్ విమానాశ్రయానికి బయలుదేరిన సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన తండ్రి, కూతురు ఉన్నారు.
పురుషోత్తమాయగూడెం వద్ద ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కారు అదుపుతప్పి కొట్టుకుపోయింది. అయితే ఇందులో ఉన్న మోతిలాల్, అశ్వినిలు కుటుంబసభ్యులకు ఫోన్ చేసినట్లు సమాచారం. తమ కారు వాగులోకి పోయిందని, మెడవరకు నీళ్లు వచ్చాయని చెప్పారు. కానీ వారి ఫోన్లు ప్రస్తుతం స్విచ్ఛాప్ కావడంతో పాటు కారు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇక, వరంగల్ జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు వరదల్లో చిక్కుకుంది. వరంగల్ నుంచి మహబూబాబాద్ వెళ్లున్న ఆర్టీసీ బస్సు నెక్కొండ-వెంకటాపురం చెరువు కట్ట పై రాత్రి 9 గంటల ప్రాంతంలో వరద ప్రభావంతో చిక్కుకుపోయింది. వెంకటాపురం వద్ద తోపనపల్లి చెరువు ఒక్కసారిగా పొంగడంతో చిక్కుకుందని సమాచారం. అయితే బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు.
Also Read: కోదాడలో బీభత్సం సృష్టిస్తున్న వర్షం .. వరదలో కొట్టుకొచ్చిన 2 మృతదేహాలు
కాగా, గత రెండు రోజుల నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు తగ్గడం లేదు. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాయుగుండం ప్రభావంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఎడతెరిపి కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల వరద ప్రవాహాలకు కొట్టుకుపోయారు.
నారాయణపేట జిల్లా: మద్దూరు మండలంలో విషాదం..
వర్షాలకు ఎక్కమేడు గ్రామంలో ఇళ్ళు కూలి ఇద్దరు మృతి..
రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు నానిపోయిన ఇళ్ళు.
రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఇల్లు కూలి తల్లి హన్మమ్మ, కూతురు అంజిలమ్మ మృతి. #TelanganaRains #WallCollapse #bigtvlive pic.twitter.com/i3roUtaKa7
— BIG TV Breaking News (@bigtvtelugu) September 1, 2024