దివంగత వైఎస్ ఆశీస్సులతో కాంగ్రెస్ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు మోపిదేవి వెంకటరమణ.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలకమైన మత్స్యకార సామాజికవర్గానికి చెందిన మోపిదేవి కాంగ్రెస్లో కీలక నేతగా ఎదిగారు. తర్వాత జగన్ బాట పట్టారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేయడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్తో కలిసి నడిచిన మోపిదేవి వెంకటరమణ.. పార్టీల కంటే వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉంటూ వచ్చారు. జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టు కూడా అయ్యారు.
వైసీపీ ఆవిర్భావం నుంచీ జగన్కు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన మోపిదేవి వెంకటరమణ.. పార్టీలో కూడా కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఆయన వైసీపీ కీలకనేతగా వ్యవహరించారు. అటువంటి మోపిదేవి పార్టీకి గుడ్ బై చెప్పడమే కాకుండా తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు ప్రకటించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. జగన్ పట్ల మోపిదేవికి అంతలా అసంతృప్తి పేరుకుపోవడం వెనుక చాలా లెక్కలే ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి మోపిదేవి ప్రయత్నించారు. తనకు కాకపోతే తన సోదరుడికి అయినా టికెట్ ఇవ్వాలని జగన్ని అభ్యర్ధించారు.
Also Read: తిరుమల కొండపై.. ఇవేం పనులు రోజా?
ఎంత అడిగినా జగన్ టికెట్ ఇవ్వలేదు. అలాగే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో మోపిదేవి మాటన అసలు పరిగణలోకి తీసుకోలేదు.. అంతేకాకుండా పార్టీ వ్యవహారాల్లో కూడా మోపిదేవికి ఇసుమంతైనా ప్రాధాన్యత ఇవ్వలేదు. అలా పూర్తిగా పక్కన పెట్టేయడంతో మోపిదేవి బాగా హర్ట్ అయ్యారంట. వైసీపీ పరాజయం తరువాత మోపిదేవి పూర్తిగా పార్టీకి దూరమయ్యారు. పార్టీ వ్యవహారాలు, కార్యక్రమాల్లో అంటీముట్టనట్టు వ్యవహరిస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు టీడీపీలో చేరేందుకు మోపిదేవి పార్టీకే కాకుండా రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా అంటున్నారు.
రేపల్లె నియోజకవర్గంలో మోపిదేవికి టీడీపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ రాజకీయ ప్రత్యర్ధిగా ఉన్నారు. ఇప్పుడు మోపిదేవి టీడీపీలోకి వస్తే ఆ రెండు వర్గాల మధ్య పొసుగుతుందా అన్న అనుమానాలు ఉన్నాయి. అయితే మరో రెండేళ్లలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. అప్పుడు రేపల్లెను అనగానికి వదిలేసి.. కొత్తగా ఏర్పడే సెగ్మెంట్కి మోపిదేవి ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యేలా టీడీపీ పెద్దలు రాజీ ఫార్ములా వర్కౌట్ చేశారంట. ఆ క్రమంలో అనగాని, మోపీదేవిల మధ్య సఖ్యత కుదిరిందంటున్నారు. ఏది ఏమైనా మోపిదేవి రాజీనామా మాత్రం వైసీపీకి కోలుకోలేని షాకే అంటున్నారు.