Railway Track Destroyed Due to Flood: తెలంగాణలో వర్షం దంచి కొడుతోంది. గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రాష్ట్రంలో పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ ధ్వంసమైంది.
మహబూబాబాద్ సమీపంలోని అమోధ్య గ్రామంలో చెరువు కట్ట తెగింది. దీంతో విజయవాడ – కాజీపేట మార్గంలో ట్రాక్ ను ఆనుకొని వరద నీరు ప్రవహించడంతో ఒక్కసారిగా ట్రాక్ కింద రాళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
ఇంటికన్నె- కేసముద్రం మార్గంలో రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. ఎగువ, దిగువ రైలు మార్గాల్లో కంకర రాళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. విద్యుత్ స్తంభాలు సైతం పక్కకు ఒరిగాయి. దీంతో విజయవాడ – కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే మహబూబాబాద్ శివారులోనూ రైలు పట్టాలపై భారీగా వరదనీరు ప్రవహిస్తోంది.
ఈ నేపథ్యంలో సమీప రైల్వే స్టేషన్లలో పలు రైళ్లను నిలిపివేశారు. కాగా, మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో మచిలీపట్నం, సింహపురి ఎక్స్ ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. అలాగే పలు రైళ్లను దారి మళ్లించారు. అదే విధంగా మంగనూరు ఎక్స్ ప్రెస్ ను కాజీపేటలో నిలిపివేశారు. ఇక, ఎంటీఎం నుంచి వయా సికింద్రాబాద్, బీదర్ వెళ్లాల్సిన రైలును మహబూబాబాద్లో నిలిచిపోయింది.
Also Read: తెలంగాణకు రెడ్ అలర్ట్.. నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు
అలాగే తాళ్లపూసలపల్లి వద్ద రైల్వే ట్రాక్ కు వరద తాకింది. దీంతో పందిళ్లపల్లి వద్ద మహబూబ్ నగర్ – విశాఖ ఎక్స్ ప్రెస్ సుమారు 4 గంటల వరకు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ ధ్వంసం కావడంతో విజయవాడ – కాజీపేట మార్గంలో 24 రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. మచిలీపట్నం, గౌతమి, సంఘమిత్ర, గంగా – కావేరి, చార్మినర్, యశ్వంత్ పూర్ సహా పలు రైళ్లను మహబూబాబాద్, డోర్నకల్, వరంగల్, పందిళ్లపల్లి సహా మరికొన్ని రైల్వే స్టేషన్లలో నిలిపివేశారు.
విజయవాడ నుంచి సికింద్రాబాద్ వయా కాజీపేట మార్గంలో వెళ్లాల్సిన పలు రైళ్లను గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్ మీదుగా మళ్లిస్తున్నారు. కాగా, ప్రయాణికులు సౌకర్యార్థం వివిధ స్టేషన్ లలో రైల్వే శాఖ హెల్ప్ లైన్ నంబర్లను సైతం ఏర్పాటు చేసింది.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాల్లపూసపల్లి శివారు రైల్వే స్టేషన్ సమీపంలో వర్షానికి కొట్టుకపోయిన రైల్వే ట్రాక్.
మహబూబాబాద్లో మచిలీపట్నం ఎక్స్ ప్రెస్తో పాటు పలు రైళ్ల నిలిపివేత. https://t.co/Un8dc56Tib pic.twitter.com/LfCZhWy5M4— ChotaNews (@ChotaNewsTelugu) September 1, 2024