– తక్షణ సహాయ చర్యలు చేపట్టండి
– సీఎస్, డీజీపీలను ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Telangana Rains: భారీ వర్షాల నేపథ్యంలో అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, వైద్యారోగ్య శాఖాధికారులు అప్రమత్తంగా ఉండేలా చూడాలని సూచించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సహాయక శిబిరాలకు తరలించాలని ఆదేశించారు. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సీఎస్, డీజీపీ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
బీ అలర్ట్.. డాక్టర్లను ఆదేశించిన మంత్రి
రాష్ట్రంలో భారీ వర్ష సూచనల నేపథ్యంలో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అప్రమత్తం చేశారు. డాక్టర్లు, సిబ్బందికి వర్షాలు తగ్గే వరకూ సెలవులు ఇవ్వొద్దని డీఎంఈ వాణి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, డీహెచ్ రవిందర్ నాయక్ను ఆదేశించారు. డాక్టర్లు, స్టాఫ్ అందరూ హెడ్ క్వార్టర్స్లోనే ఉండాలని, ప్రతి ఒక్కరూ డ్యూటీలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్(ఈడీడీ) దగ్గరగా ఉన్న గర్భిణీలను ముందే హాస్పిటళ్లకు తరలించి, వెయిటింగ్ రూమ్స్ కేటాయించాలని ఆదేశించారు. గర్భిణికి, ఆమెతో వచ్చిన కుటుంబ సభ్యులకు భోజన వసతి కల్పించాలని ఆదేశించారు. అంబులెన్స్ సర్వీసులు అన్ని చోట్ల అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
Also Read: CM Revanth Reddy: టూరిజం హబ్గా తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
మెడిసిన్, టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని మంత్రి సూచించారు. పేషెంట్లకు అందించే ఆహారం, తాగునీరు విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాలు తగ్గిన తర్వాత దోమల బెడద ఎక్కువగా ఉంటుందని, ప్రస్తుతం తగ్గుముఖం పట్టిన జ్వరాలు మళ్లీ పెరిగే ప్రమాదం ఉందని మంత్రి హెచ్చరించారు. ఈ విషయాన్ని ముందే ప్రజలకు తెలిసేలా అవగాహన కల్పించాలని, పంచాయతీరాజ్, మునిసిపల్ శాఖ సహకారం తీసుకోవాలని సూచించారు. మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీల హాస్టళ్లలో స్టూడెంట్స్కు అందజేసే ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గురుకులాల్లో పిల్లలకు అందించే భోజనం విషయంలోనూ జాగ్రత్తలు పాటించేలా సంబంధిత శాఖ అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేయాలని ఆదేశించారు మంత్రి దామోదర రాజనర్సింహ.