– కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో ఘోరాలెన్నో
– విద్యార్థులు చస్తున్నా పట్టింపు లేదా?
– గొడ్డుకారంతో భోజనం పెట్టడం ఏంటి?
– ప్రభుత్వంపై మండిపడ్డ హరీష్ రావు, సబిత
– పాలమాకుల గురుకుల పాఠశాల సందర్శన
Welfare Hostels: ఒకవైపు పాము కాట్లు, ఇంకోవైపు ఎలుకలు కరిచి గురుకులాల్లో విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని మాజీ మంత్రులు హరీష్ రావు, సబిత ఇంద్రారెడ్డి మండిపడ్డారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం పాలమాకుల గురుకుల పాఠశాలను వారిద్దరూ సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే ఎందుకు స్పందించరని హరీష్ రావు నిలదీశారు. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని, చీమ కుట్టినట్లు అయినా లేదంటూ ఫైరయ్యారు. గురుకులాల్లో కేసీఆర్ సన్న బియ్యంతో అన్నం పెడితే, కాంగ్రెస్ ప్రభుత్వం గొడ్డుకారంతో పెడుతోందని ఆరోపించారు. 500 మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారని, 38 మంది చనిపోయారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నదనడానికి ఇదే నిదర్శనమన్నారు. అన్నంలో, పప్పులో పురుగులు ఉన్నాయంటే తినండి అంటున్నారని, ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారని, పుస్తకాలు కూడా ఇవ్వలేదని ఆరోపణలు చేశారు. తమ దీన స్థితిని వ్యక్తం చేస్తూ విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారని అన్నారు.
Also Read: Hyderabad Rains: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూల్స్, కాలేజీలకు రెండు రోజులు సెలవు
స్వయానా ముఖ్యమంత్రే విద్యా శాఖా మంత్రిగా ఉన్నా, మైనార్టీ గురుకులాలకు జనవరి నుండి మెస్ బిల్లులు ఇవ్వలేదని ఆరోపించారు హరీష్ రావు అన్ని గురుకులాల్లో కాస్మొటిక్ చార్జెస్, కరెంటు బిల్లులు, మెస్ బిల్లులు రావడం లేదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో ఘోరాలు ఎక్కువయ్యాయని, అటు విద్య లేదు ఇటు భోజనం లేదని మండిపడ్డారు. కనీస సౌకర్యాలు లేవంటూ కన్నీటి పర్యంతమైన విద్యార్థులను చూస్తుంటే తమకు కన్నీళ్ళు ఆగలేదని వ్యాఖ్యానించారు. సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, గురుకులాల్లో ఇబ్బందులు ఉన్నాయని తాము అసెంబ్లీలో ప్రస్తావిస్తే, ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం స్పందించి రివ్యూ చేశామని కూడా చెప్పలేదన్నారు. ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తుంటే రేవంత్ రెడ్డికి చీమ కుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు.