– నాగార్జునసాగర్ టూరిజంపై స్పెషల్ ఫోకస్
– బుద్ధవనంలో అంతర్జాతీయ మ్యూజియం
– హైదరాబాద్, నాగార్జునసాగర్ ఫోర్ లేన్ రహదారికి నిర్ణయం
– హుస్సేన్ సాగర్ చుట్టూ స్కై వాక్ వే
– వరల్డ్ క్లాస్ టూరిజం హబ్
– సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
Tourism Hub: తెలంగాణలో టూరిజం శాఖపై ప్రత్యేక దృష్టి సారించింది ప్రభుత్వం. ఆలయాలు, ఇతర టూరిజం స్పాట్స్ అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే, రాష్ట్రంలో ఉన్న బౌద్ధ పర్యాటక స్థలాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దేశ విదేశాల్లోని బుద్ధిస్టులను ఆకట్టుకునేలా బుద్ధవనంలో ఇంటర్నేషనల్ మ్యూజియం నెలకొల్పే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
అంతర్జాతీయ స్థాయిలో మ్యూజియం
కొత్త టూరిజం పాలసీలో భాగంగా తెలంగాణలో చారిత్రకంగా పేరొందిన ఫణిగిరి, నేలకొండపల్లి, నాగార్జునసాగర్ బుద్ధ క్షేత్రాలతో పాటు హుస్సేన్ సాగర్లో ఉన్న విగ్రహాన్ని ఒకే టూరిజం సర్క్యూట్గా అభివృద్ధి చేయాలని సంకల్పించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వదేశీ దర్శన్ 2.0 స్కీమ్లో భాగంగా బుద్ధవనం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కేంద్రానికి డీపీఆర్ను పంపించింది. రూ.25 కోట్ల అంచనాలతో బుద్ధవనంలో బుద్ధిస్ట్ డిజిటల్ మ్యూజియం అండ్ ఎగ్జిబిషన్, డిజిటల్ ఆర్కివ్స్ ఏర్పాటు చేయాలని అందులో ప్రతిపాదించింది. వీటితో పాటు తాజాగా ఇంటర్నేషనల్ బుద్ధ మ్యూజియాన్ని ఈ ప్రణాళికలో పొందుపరచనుంది. నాగార్జునసాగర్ బుద్ధవనాన్ని టూరిజం, స్పిర్చువల్ డెస్టినేషన్ సెంటర్గా తీర్చిదిద్దుతారు. డ్యామ్ అందాలతో పాటు పరిసరాల్లోని బుద్ధవనాన్ని అంతర్జాతీయ బౌద్ధక్షేత్రంగా అభివృద్ధి చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యం. నాగార్జున సాగర్ సందర్శనకు వెళ్లే పర్యాటకులు బ్యాక్ వాటర్ వరకు బోట్లో విహరించే ఏర్పాట్లు పునరుద్ధరించాలని నిర్ణయించారు. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షించేందుకు అనువైన టూరిజం ప్యాకేజీలు రూపొందించనున్నారు. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వరకు ఫోర్ లేన్ రోడ్ నిర్మాణం జరగనుంది. ఈ రహదారికి ప్రతిపాదనలు తయారు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Also Read: ఐఏఎస్ అధికారుల బదిలీ.. వివరాలివే
ట్యాంక్ బండ్ దగ్గర స్కై వాక్ వే
హైదరాబాద్ హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం చుట్టూ టూరిజం డెస్టినేషన్ సర్కిల్ గా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ట్యాంక్ బండ్, తెలంగాణ అమరుల జ్యోతి, నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్కు వరకు వలయాకారంలో స్కై వాక్ వే డిజైన్ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో వరల్డ్ క్లాస్ టూరిజం హబ్గా రూపొందించాలని ఆదేశించారు. అనుభవమున్న కన్సల్టెన్సీలు, నిపుణులతో అంతర్జాతీయ స్థాయి నమూనా డిజైన్లు తయారు చేయించాలన్నారు. పర్యాటకులు ఆహ్లాదంగా గడిపేలా ఫుడ్ కోర్టులు, వివిధ స్టాళ్లను ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని సిటీలో సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.
ఆపరేషన్ గోల్కొండ
గోల్కొండ చుట్టూ ఉన్న రోడ్లన్నీ ఇరుకుగా అయ్యాయని, వాటిని విశాలంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆక్రమణలుంటే తొలగించాలని, అక్కడున్నవారు, దుకాణదారులు, నిరాశ్రయులు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వారికి మరోచోట పునరావాసం కల్పించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.