బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో మత్య్సకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్రానికి రెడ్ అలెర్ట్ జారీ చేశారు. రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని తెలిపారు. వాయుగుండం కళింగపట్నం, విశాఖపట్నం, గోపాల్ పూర్ తీర ప్రాంతాలను దాటే అవకాశం ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా అతి భారీ వర్షాల నేపథ్యంలో ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఏ విధమైన ఆకస్మిక విపత్తు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశం కూడా ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికలను గుర్తుచేశారు. ప్రతీ జిల్లా కలెక్టర్ కార్యాలయంతోపాటు జీహెచ్ఎంసీ, రాష్ట్ర సచివాలయంలోనూ కంట్రోల్ రూమ్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
వర్షాల దృష్ట్యా జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించుకునే నిర్ణయం జిల్లా కలెక్టర్లు తీసుకోవాలని సీఎస్ సూచించారు. వరద ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల నుండి ప్రజలను తరలించి పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసే విషయంలో ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు.
ఇక రాజధాని హైదరాబాద్లో కూడా వర్షం బీభత్సంగా కురుస్తున్నది. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
రేపు, ఎల్లుండి.. రెండు రోజులపాటు హైదరాబాద్ నగరంలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.