Heavy Rain Forecast: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్. వాతావరణశాఖ తాజాగా కీలక అలర్ట్ ను జారీ చేసింది. వచ్చే రెండుమూడు గంటల్లో భారీ వర్షం కురవనున్నదని తెలిపింది. మరికొన్ని భారీ నుంచి అతిభారీ వర్షం కురవనున్నదని తెలిపింది. నగర వాసులెవరూ ఇళ్లల్లోంచి బయటకు రావొద్దంటూ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులను అప్రమత్తం చేసింది.
ఇదిలా ఉంటే.. నగరంలో వర్షం కురుస్తూనే ఉంది. శనివారం ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉన్నది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరుతుంది. పలు చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. వాతావరణ శాఖ అలర్ట్ చేయడంతో జీహెచ్ఎంసీ అధికారులు రోడ్లపై నీరు నిలవకుండా ఎప్పటిదప్పుడు వరదనీరును క్లియర్ చేస్తున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ అధికారులు సూచిస్తున్నారు.
కాగా, ఇరు రాష్ట్రాల్లో ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం, తీవ్ర వాయుగుండంగా మారడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
Also Read: మీరు హుస్సేన్ సాగర్కు వెళ్తున్నారా..? అయితే, సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన గుడ్న్యూస్ మీ కోసమే..
రాష్ట్రంలో భారీ నుండీ అతి భారీవర్షాలు కురుస్తున్నందున నీటిపారుదల శాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖాధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత ప్రభుత్వ వాతావరణ శాఖా రెడ్ ఏలెర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఈ సమయంలో అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను అధ్యయనం చేస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనుమతి లేకుండా ఇంజినీర్లు హెడ్ క్వార్టర్ ను విడిచి పోవద్దని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ విధిగా హెడ్ క్వార్టర్ లోనే ఉండాలని సూచించారు. రెడ్ ఎలెర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఎవ్వరూ సెలవులు పెట్టొద్దన్నారు. ఎప్పటికప్పుడు రిజర్వాయర్లు, చెరువులను మానిటరింగ్ చేస్తుండాలన్నారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు నీటి స్థాయిలను పర్యవేక్షించాలన్నారు. మరీ ముఖ్యంగా ఓవర్ ఫ్లో ను నిరోధించడానికి గేట్లు,స్పిల్ వేల పనితీరును క్షుణ్ణంగా పరిశీలంచాలన్నారు. ఎప్పటికప్పుడు డ్యామ్ లు కట్టలు,కెనాల్ లను తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రమాదం పొంచి ఉందన్న ప్రాంతంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అంతకు మించి రైల్వే ఎఫెక్టెడ్ చెరువుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితిలలో నీటిపారుదల శాఖా ఇంజినీర్లు వేగవంతంగా స్పందించాలన్నారు.
విపత్తులు సంభవిస్తే స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజలను అప్రమత్తం చెయ్యాలని అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
Also Read: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూల్స్, కాలేజీలకు రెండు రోజులు సెలవు
వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. ఖమ్మం, మధిరలో భారీ వర్షాల నేపథ్యంలో.. ఒక్కసారిగా వాగులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయన్న సమాచారం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. కరీంనగర్, చెన్నూరు పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని హుటాహుటిన నేరుగా శనివారం రాత్రి ఖమ్మం బయలుదేరారు.
మార్గమధ్యంలో ఖమ్మం కలెక్టర్, కమిషనర్, మధిర రెవెన్యూ, నిసిపల్ అధికారులతో పరిస్థితిని సమీక్షించి పలు సూచనలు చేశారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు అలెర్ట్ గా ఉండాలని సూచించారు. వాగులు, వంకలు పొంగుతున్న నేపథ్యంలో ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను క్యాంపులకు తరలించాలని.. అక్కడ వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కూడా అధికారులను ఆయన ఆదేశించారు.