Jaishankar: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వేదికగా పాకిస్థాన్ కు భారత్ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి చర్చా కార్యక్రమంలో భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్. జైశంకర్ పాల్గొన్నారు.
కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన దాయాది దేశానికి జైశంకర్ దీటుగా బదులిచ్చారు.
ఒసామా బిన్ లాడెన్ లాంటి ఉగ్రవాదికి ఆశ్రయం కల్పించిన దేశానికి, పొరుగు దేశ పార్లమెంట్పై దాడికి పాల్పడిన వారికి ఐక్యరాజ్య సమితి లాంటి ప్రపంచ వేదికపై నీతుల చెప్పే అర్హత లేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి ఊతమిచ్చేవారిని రక్షించడానికి అంతర్జాతీయ వేదికలను కొన్ని దేశాలు దుర్వినియోగం చేస్తున్నాయంటూ పరోక్షంగా చైనా, పాకిస్థాన్లపై ఘాటు విమర్శలు చేశారు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ‘అంతర్జాతీయ శాంతి భద్రతల నిర్వహణ- సంస్కరణల’పై చర్చ జరుగుతుండగా పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. దీంతో జైశంకర్ గట్టిగా సమాధానం చెప్పారు. కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేయడం పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని జైశంకర్ మరోసారి ప్రపంచ దేశాలకు స్పష్టం చేశారు. ఈ వాస్తవాన్ని పాక్ ఇకనైనా అంగీకరించాలన్నారు. భారత వ్యతిరేక ప్రచారాన్ని ఆపాలంటూ హితవు పలికారు. ఉగ్రవాదం, శత్రుత్వం, హింసకు తావు లేని వాతావరణంలో మాత్రమే తాము పాకిస్థాన్ తో సంబంధాలు కోరుకుంటున్నామని తేల్చిచెప్పారు.
కరోనా మహమ్మారి ముప్పు, పర్యావరణ మార్పు, ఉగ్రవాదం.. ఇలాంటి కీలక సవాళ్లపై సమర్థవంతంగా ప్రతిస్పందిస్తేనే ఐక్యరాజ్యసమితిపై విశ్వసనీయత పెరుగుతుందన్నారు. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి భారత్ అధ్యక్షత వహిస్తోంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలు, తీసుకురావాల్సిన సంస్కరణలపై చర్చించేందుకు జైశంకర్ ఐక్యరాజ్య సమితి కార్యాలయానికి వెళ్లారు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్తో .. అక్కడ ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.