– అక్రమ అనుమతులపై హైడ్రా ఫోకస్
– ఎఫ్టీఎల్ పరిధిలో పర్మిషన్లు ఇచ్చిన అధికారులపై వేటు
– ఆరుగురిపై క్రిమినల్ కేసుల నమోదు
– సైబరాబాద్ ఈఓడబ్ల్యూ వింగ్ పోలీసుల విచారణ
FTL: అక్రమ కట్టడం అని తేలితే చాలు క్షణాల్లో కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. ప్రభుత్వం సైడ్ నుంచి ఫుల్ ఫ్రీడమ్ దొరకడంతో, ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇదే క్రమంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులపైనా ఫోకస్ పెట్టారు. తాజాగా కొందరిపై కేసులు నమోదు చేశారు. దీంతో ఈ వ్యవహారంలో ఇంకెంతమంది పేర్లు బయటకు వస్తాయనేది చర్చనీయాంశంగా మారింది.
కేసులు పెట్టింది వీరి మీదే!
మొత్తం ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు పోలీసులు. సైబరాబాద్ ఈఓడబ్ల్యూ వింగ్లో ఈ కేసులు పెట్టారు సీపీ అవినాష్. నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, చందానగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుదామ్ష్, బాచుపల్లి ఎమ్మార్వో పూల్ సింగ్, మేడ్చల్ మల్కాజ్గిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్, హెచ్ఎండీఏ సిటీ ప్లానర్ రాజ్ కుమార్లపై కేసులు నమోదు చేశారు.
Also Read: Shocking Video: కిడ్నాపర్ను వదిలిరానంటూ బోరున ఏడ్చిన బాలుడి వీడియో వైరల్
హైడ్రాకు ఫిర్యాదులు
అక్రమ కట్టడాల కూల్చివేత సందర్భంగా హైడ్రాకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. కేవలం కూల్చివేతే కాదు, అవి అక్రమమని తెలిసినా కూడా అనుమతులు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపించింది. రాజకీయ ప్రముఖులు సైతం దీనిపై మాట్లాడారు. ఇదే క్రమంలో హైడ్రా సిఫార్సు మేరకు ఆరుగురు అధికారులపై కేసులు పెట్టారు పోలీసులు. ఎఫ్టీఎల్లో అనుమతులు ఇచ్చినందుకు వారిపై తదుపరి చర్యలు తీసుకోనున్నారు.