Venezuela hit by nationwide power outages..government blames saboteurs: సౌత్ అమెరికాలోని వెనిజులా గత ఐదేళ్లుగా రాజకీయ, ఆర్థిక అస్థిరతతో కొట్టుమిట్టాడుతోంది. తీవ్ర ద్రవ్యోల్బణంతో ప్రజలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అంతకంతకూ పెరిగిపోతున్న నిత్యావసరాలు..వాటిని అదుపు చేయలేక చేతులెత్తేసింది అక్కడి ప్రభుత్వం. దీనితో ఆ దేశం నుంచి తట్టాబుట్టా సర్ధుకుని ఇతర దేశాలకు వలస వెళ్లిపోతున్నారు జనం. ఒక పక్క పెరిగిపోయిన నిత్యావసరాలు కొనుగోలు చేయలేక అవస్థలు పడుతున్న జనం నెత్తిన మరో పిడుగు పడింది. రాత్రి పగలు అని తేడా లేకుండా అక్కడ అప్రకటిత విద్యుత్ కోతలు ఎదుర్కొంటున్న ప్రజలకు శుక్రవారం తెల్లవారు జామునుంచి దాదాపు 24 గంటలుగా తీవ్ర విద్యుత్ అంతరాయం కలిగింది. దాదాపు 24 రాష్ట్రాలు అంధకారంలో మునిగిపోయాయి. పలు ఆసుపత్రులలో ఎమర్జెన్సీ సేవలు నిలిచిపోయాయి. అయితే ఇది తమ పని కాదని దేశ అధ్యక్షుడు నికోలస్ మడురో చెబుతున్నారు.
సంఘ విద్రోహ చర్య
ఎవరో సంఘ విద్రోహ శక్తులు కావాలని విద్యుత్ సబ్ స్టేషన్లను ధ్వంసం చేయడంతోనే ఈ పరిస్థితి ఎదురయిందని అంటున్నారు. తనపై తన రాజకీయ ప్రత్యర్థులే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని నికోలస్ పేర్కొన్నారు. ఇది ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాదని..దాదాపు అన్ని రాష్ట్రాలలో విద్యుత్ సంక్షోభం తలెత్తిందని..సాధ్యమైనంత త్వరలోనే ఈ సమస్యకు పరిష్కరిస్తామని చెబుతున్నారు. నిరంతర విద్యుత్ కోతతో కనీసం సెల్ ఫోన్లకు చార్జింగ్ చేసుకునే అవకాశం లేకపోవడంతో కమ్యునికేషన్ గ్యాప్ ఏర్పడిందని..తమ బంధువులతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం లేకపోవడంతో వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో కూడా తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.