Rocks : ఆ వ్యక్తి వేట కోసం ఇంటి నుంచి వెళ్లాడు. ప్రమాదశాత్తు బండరాళ్ల మధ్య తలకిందులుగా ఇరుక్కుపోయాడు. గంటల తరబడి నరకయాతన అనుభవిస్తున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన షాడ రాజు మంగళవారం సాయంత్రం మిత్రుడు మహేశ్తో కలిసి ఘన్పూర్ శివారు అడవిలో వేటకు వెళ్లాడు. రాళ్లపై నుంచి నడుచుకుని వెళ్తుండగా సెల్ఫోన్ పడిపోయింది. ఆ ఫోన్ బండరాళ్ల మధ్యలోకి వెళ్లిపోయింది. దీంతో బండరాళ్ల మధ్యకు దూరి రాజు ఫోన్ ను బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. తను కూడా బండరాళ్ల మధ్య చిక్కుకుపోయాడు.
రాజు తలకిందులుగా రాళ్ల మధ్యలోకి జారి ఇరుక్కుపోయాడు. వెంట వచ్చిన మిత్రుడు బయటకు తీసేందుకు చాలాసేపు ప్రయత్నించాడు. అయినా మిత్రుడిని బయటకు లాగలేకపోయాడు. ఎంత శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. రాజు కాళ్లు, ఒక చేయి మాత్రమే బయటకు కనిపిస్తున్నాయి. దీంతో రాజు కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని చెప్పాడు. వారంతా ఘటన స్థలికి వచ్చి రాజును బయటకు తీసేందుకు ప్రయత్నించారు.
ఈ ప్రమాదంపై తొలుత అధికారులకుగానీ, పోలీసులకుగానీ సమాచారం అందలేదు. రాజు కుటుంబ సభ్యులు, మిత్రులు బుధవారం మధ్యాహ్నం వరకు బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. రాజును బయటకు తీసేందుకు ఏఎస్పీ అన్యోన్య ఆధ్వర్యంలో ఆపరేషన్ ప్రారంభించారు. యంత్రాల సాయంతో బుధవారం రాత్రి కూడా ప్రయత్నాలు కొనసాగించారు. రాజుకు ధైర్యం చెబుతూ.. నీళ్లు, ఓఆర్ఎస్ తాగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా బాధితుడిని బయటకు తీసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
రాజుకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వేటకు వెళ్లి ఇలా అనుకోని ప్రమాదంలో చిక్కుకుపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. తన భర్త ఎప్పుడు బండరాళ్ల నుంచి బయటకు వస్తాడని భార్య ఎదురుచూస్తోంది. తండ్రి కోసం ముగ్గురు చిన్నారులు తపిస్తున్నారు. రాజు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాజును ఎలాగైనా కాపాడాలని వేడుకుంటున్నారు.