Janwada farm house: జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో ఏం జరుగుతోంది? కొలతలు వేసి నానాహంగామా చేసిన అధికారులు ఎందుకు సైలెంట్ అయ్యారు? అధికారుల్లో వేడి తగ్గిందా? ఎందుకు అధికారులు వెనక్కి తగ్గారు? ఇవే ప్రశ్నలు తెలంగాణ ప్రజలను వెంటాడుతున్నాయి.
సముద్రం ప్రశాంతంగా ఉందంటే ఆ తర్వాత ఊహించని అలలు ఎగిసిపడతాయి. జన్వాడ విషయంలోనూ అదే జరుగుతుందని అంటున్నారు అధికారులు. ఎలాంటి అనుమతులు లేకుండా జన్వాడ ఫామ్ హౌస్ నిర్మాణం జరిగినట్టు తెలుస్తోంది. దీంతో మరింత లోతుగా డీటేల్స్ సేకరించే పనిలో పడ్డారు.
ఒకటికి రెండుసార్లు వాటిని పరిశీలిస్తున్నారు. రేపోమాపో కూల్చివేసేందుకు వెనుక ప్రిపేర్ అవుతున్నారు అధికారులు. ఎందుకంటే ఈ వ్యవహారం న్యాయస్థానంలో ఉండడంతో ఒకటికి రెండు సార్లు డాక్యుమెంట్లను చెక్ చేస్తున్నారు. ఒకవైపు రెవిన్యూ, మరోవైపు జలమండలి.. ఇంకోవైపు పంచాయితీ అన్ని దస్త్రాలను సేకరణ జరుగుతోంది. వాటన్నింటినీ క్రోడీకరించినట్టు సమాచారం.
ALSO READ: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ఆరో తరగతి విద్యార్థిని దుర్మరణం
జన్వాడ ఫామ్ హౌస్ను లీజుకు తీసుకున్నానని చెబుతున్నారు మాజీ మంత్రి కేటీఆర్. చెరువు లేదా ఎఫ్టీఎల్ను ఆక్రమించి కడితే కూల్చివేయవచ్చని ధీమాగా చెబుతున్నారు. ముందు అధికార పార్టీకి చెందిన నేతల ఫామ్ హౌస్లు ఉన్నాయన్నారు. కేటీఆర్ చెప్పిన నేతలంతా బయటకు వచ్చారు. ఒక్క అంగుళం ఆక్రమించినా కూల్చివేయవచ్చని ఓపెన్గా చెప్పారు. దీంతో బీఆర్ఎస్ నేతల నోళ్లకు తాళం పడినట్లైంది.
జన్వాడ ఫామ్హౌస్ కు సంబంధించిన అన్ని పత్రాలను పరిశీలించారు అధికారులు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం జరిగినట్టు ప్రాథమికంగా తేలింది. బుల్కాపూర్ నాలా బఫర్జోన్ పరిధిలో ఉందన్న ప్రచారంతో చేవెళ్ల రెవిన్యూ డివిజన్ అధికారులు డీటేల్స్ వెలికి తీశారు.
గురువారం నాటికి సర్వే పూర్తి చేశారు. ఉపగ్రహ చిత్రాలు, గ్రామ పంచాయితీ డీటేల్స్తో సరిపోల్చారు. ఈ వారంలో నివేదిక రంగారెడ్డి కలెక్టర్కు ఇవ్వనున్నారు. ఆ నివేదిక ఆధారంగా హైడ్రా రంగంలోకి దిగనుంది. వచ్చేవారంలో ఫామ్ హౌస్ని కూల్చివేయడం ఖాయమన్నది అధికారుల మాట.
దుర్గం చెరువు సమీపంలో అక్రమంగా ఇళ్లు కట్టినవారికి నోటీసులు ఇచ్చారు అధికారులు. ఇంటి యజమానులకు కొంత గడువు ఇచ్చారు. ఇందులో బడాబాబులున్నట్లు తేలింది. జన్వాడకు ముందే దుర్గం చెరువు అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ఆలోచన చేస్తోంది హైడ్రా.