KTR: ఢిల్లీలో బిగ్ ఈవెంట్. బీఆర్ఎస్ ఆఫీస్ ఓపెనింగ్. రెండు యాగాలు, ఇద్దరు జాతీయ నేతలతో ఫుల్ హడావుడి. గులాబీ పరివారమంతా హస్తినలోనే ఉంది. ఒక్క కేటీఆర్ మినహా. అదేంటి, ఇంతటి కీలక కార్యక్రమానికి కేటీఆర్ ఎందుకు అటెండ్ కాలేదు? అనేదానిపై ఉదయమంతా చర్చ నడిచింది. అసలు విషయం తెలిశాక.. అంతా ఆయన్ను అభినందిస్తున్నారు.
కేసీఆర్ తో సహా మంత్రివర్గమంతా ఢిల్లీ వెళితే రాష్ట్రాన్ని ఎవరు చూసుకుంటారు? అసలే, కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపు ఇచ్చింది. బండి సంజయ్, షర్మిల యాత్రలతో స్టేట్ లో పొలిటికల్ యాక్టివిటీ ఉద్రిక్తంగా ఉంది. ఇలాంటి సమయంలో, ఎందుకైనా మంచిదని కేటీఆర్ ను హైదరాబాద్ లోనే ఉంచేసి.. కేసీఆర్ అండ్ కో ఢిల్లీ వెళ్లారంటూ ప్రచారం జరిగింది. కానీ, అసలు రీజన్ అది కాదని.. రెండు ముఖ్యమైన మీటింగ్స్ ఉండటం వల్లే కేటీఆర్.. హస్తినలో జరిగిన బీఆర్ఎస్ కార్యాలయ కార్యక్రమానికి హాజరు కాలేదని తెలుస్తోంది.
మారుతి సుజుకికి చెందిన అంతర్జాతీయ విభాగాల అధిపతులతో కేటీఆర్ సమావేశం చాలాకాలం క్రితమే షెడ్యూల్ అయ్యింది. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే అంశం కావడంతో పాటు జపాన్ కి చెందిన ప్రతినిధులు టైమ్ కు చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి.. తప్పక ఆ భేటీకి అటెండ్ కావాల్సి ఉంది. అలానే, మరో ప్రముఖ కంపెనీతోనూ పెట్టుబడుల అంశంపై చర్చించాల్సి ఉంది. రెండూ కీలకమైన మీటింగ్సే కావడంతో కేటీఆర్ ఢిల్లీ బీఆర్ఎస్ ప్రోగ్రామ్ కు వెళ్లకుండా హైదరాబాద్ లోనే ఉండిపోయారు. కేసీఆర్ ముందస్తు అనుమతితోనే కేటీఆర్ ఢిల్లీకి డుమ్మా కొట్టారట.
గతంలో మహీంద్ర కంపెనీ సీఈవోకు గొడుగు పట్టి.. పెట్టుబడిదారులకు తెలంగాణ ప్రభుత్వం ఎంత మర్యాద ఇస్తుందో మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించారు కేటీఆర్. తెలంగాణకు భారీగా కంపెనీలు, పెట్టుబడులు వస్తున్నాయంటే.. అందులో ఆయన కృషి అధికం. తాజాగా, రాష్ట్రం కోసం.. పార్టీకి చెందిన కీలక కార్యక్రమానికి వెళ్లకుండా.. తెలంగాణ అభివృద్ధిపై తన చిత్తశుద్ది చాటుకున్నారు కేటీఆర్ అని అంటున్నారు.