Officals Hidding Facts in Kolkata Junior Doctor Case : కోల్కతా ట్రైనీ డాక్టర్ రేప్, మర్డర్ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. అన్నీ స్పష్టంగా ఉన్నట్లున్నా.. కేసులో అస్పష్టత మాత్రం అలాగే ఉంది. ఒకవైపు బెంగాల్ రాష్ట్రం అట్టుడికిపోతుంటే.. మరోవైపు, రాజకీయాల ఎంట్రీ రచ్చ రచ్చ చేస్తున్నాయి. సున్నితమైన అంశం ప్రస్తుతం పొలిటికల్ కంపు కొడుతోంది. ఈ పరిణామాల మధ్య, భారత రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు చేశారు. నిర్భయ కేసు తర్వాత కూడా ఆగని ఈ అకృత్యాలపై మరో స్థాయి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ప్రెసిడెంట్ మాటలు మరో కొత్త చట్టాన్ని సూచిస్తున్నాయా..? అంటే, నిర్భయ చట్టం ఫెయిల్ అయ్యిందా…? పదేళ్లుగా నిర్భయ చట్టం ఎందుకు ప్రభావం చూపలేకపోయింది? మళ్లీ మళ్లీ అలాంటి ఘటనలే ఎందుకు పునరావృతం అవుతున్నాయి..? ఈ అకృత్యాలకు అంతమే లేదా..?
అభయ, నిర్భయ, దిశ.. ఇలా పేర్లు మార్చుతూ ఎన్ని చట్టాలు వస్తున్నా నేరాల్లో మాత్రం మార్పు రావట్లేదు. ఇదే ఇప్పుడు భారతదేశాన్ని కలవరపెడుతోంది. ఆత్యాధునిక నాగరికతలో బతుకుతున్నామని గొప్పగా చెప్పుకుంటున్న సమాజంలో స్త్రీలు సురక్షితంగా లేని పరిస్థితి. బుద్ధిలేని కొందరు పురిటిలోనే ఆడపిల్లను చంపేస్తుంటే… భయంలేని మృగాళ్లు వయసుతో సంబంధం లేకుండా స్త్రీలపై అత్యాచారలకు ఒడిగడుతున్నారు. స్ర్తీని గౌరవించే సమాజమని భారతదేశానికి ఉన్న ప్రతిష్టకు విరుద్ధంగా దేశంలో పరిస్థితులు మారుతున్నాయి. నిర్భయ చట్టం వచ్చి పదేళ్లు దాటుతున్నా… ప్రతిరోజూ ఏదో ఒక చోట ఆడపిల్లలు బలైపోతున్నారు. చట్టం అయితే పగడ్భందీగానే ఉంది. కానీ, దాని అమలు మాత్రం ఆశించిన రీతిలో లేదు. ఇలాంటి ఘటనల్లో సత్వరమే జరగాల్సిన న్యాయం మరింత దూరం జరుగుతోంది. ఎందుకిలా అవుతోంది..?
ఇరవై రోజుల క్రితం పశ్చిమ బెంగాల్లోని ట్రైనీ డాక్టర్ నైట్ డ్యూటీలో కాస్త విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అత్యంత ఘోరంగా రేప్ చేసి, హత్య చేశారు. అది స్పష్టంగా అత్యాచారం, హత్య అని సంఘటనా స్థలంలోని ఆధారాలన్నీ ఉన్నా ఆసుపత్రి అధికారులు మాత్రం ఆత్మహత్య అని పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసులు, కేంద్ర క్రైం బ్రాంచ్లు దర్యాప్తు చేస్తున్నా కేసు కొలిక్కి రాలేదు. రాష్ట్రమంతా ఆందోళనలతో రగిలిపోతుంటే.. రాజకీయ నాయకులు మాత్రం శవ రాజకీయాలకు తెరలేపారు. కేసు సంగతి పక్కన పెట్టి ఆరోపణలు, ప్రత్యారోపణలతో కాలం వెళ్లదీస్తున్నారు. ఏకంగా భారత రాష్ట్రపతి దీనిపై స్పందించే పరిస్థితి తీసుకొచ్చారు. మొట్టమొదటిసారి భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఈ కేసుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి సందర్భాల్లో రాష్ట్రపతి స్పందించడం చాలా అరుదుగా జరుగుతుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల రిత్యా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఆవేదనను వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా జరుగున్న ఇలాంటి క్రూరమైన అత్యాచారాలను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ భయానక ఘటన గురించి తెలుసుకొని చలించిపోయానని అన్నారు. ఇలాంటి దారుణాలు ఇకపై జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఆగస్ట్ 28న పీటీఐకి రాసిన ఒక ప్రత్యేక ఆర్టికల్లో రాష్ట్రపతి తన ఆవేదనను తెలియజేశారు. కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన దారుణమైన అత్యాచారం, హత్య భయాందోళనకు గురిచేస్తుందని అన్నారు. దేశంలో వరుసగా మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో దేశమంతా ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. బాధితుల్లో కిండర్ గార్టెన్ బాలికలు కూడా ఉండటం మానవత్వానికే మచ్చ అని వ్యాఖ్యానించారు. ఇక, ఇప్పటి వరకూ జరిగింది చాలు… మహిళల పట్ల దృస్టి కోణం మారితో ఇలాంటి అకృత్యాలు జరగవని తెలిపారు.
ఒకవైపు కోల్కతా ఘటనపై విద్యార్థులు, వైద్యులు, పౌరులు నిరసన ప్రదర్శనలు చేస్తుంటే మరోవైపు నేరగాళ్లు చెలరేగిపోవడంపై రాష్ట్రపతి అసహనం వ్యక్తం చేశారు. 12 ఏళ్ల క్రితం ఢిల్లీ నడివీధిల్లో జరిగిన నిర్భయ ఘటన తర్వాత మహిళలపై నేరాలు జరగకుండా వ్యూహాలు రూపొందించుకున్నా.. ప్రణాళికలు అమల్లోకి తీసుకొచ్చినా.. నేరలు మాత్రం ఆగడం లేదుు. గత 12 ఏళ్లల్లో లెక్కలేనన్ని దారుణాలు జరిగాయి. అందులో కొన్ని మాత్రమే అందరి దృష్టికి వస్తున్నాయి. అయితే, దేశం, ప్రభుత్వాలు నేర్చుకున్నా పాఠాలేంటీ..? ఒక ఘటనకు సంబంధించిన ఆందోళన ముగిసిపోగానే సదరు ఘోరాలు మరుగునపడుతున్నాయి. అందరూ వాటి మర్చిపోతున్నారు. మరో ఘోరం జరిగాక పాత ఘోరాలను గుర్తుచేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాము. ఇది సరైన విధానమా…? సరిగ్గా ఇదే ప్రశ్న రాష్ట్రపతి ముర్మూ మాటల్ల్లో వెల్లడయ్యింది.
Also Read: కోల్ కతా డాక్టర్ ఘటనలో.. తెరపైకి మరో కొత్త పేరు
డిసెంబర్ 17, 2012న నిర్భయగా పిలువబడే 23 ఏళ్ల మహిళపై కదులుతున్న బస్సులో సామూహికంగా అత్యంత ఘోరంగా చేసిన అత్యాచారం, హత్యతో భారతదేశం మేల్కొంది. నేరంలో కనిపించిన క్రూరత్వం, మహిళలకు సంబంధించిన సమస్యలు, భద్రపై తీవ్రమైన ఆందోళనలు చెలరేగాయి. అయినా, ఏడాది నిండకుండానే దక్షిణ ముంబైలోని శక్తి మిల్స్ కాంపౌండ్లో 22 ఏళ్ల ఫోటో జర్నలిస్ట్పై ఒక బాలుడితో సహా ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. 2013, సెప్టెంబర్ 3న, 18 ఏళ్ల టెలిఫోన్ ఆపరేటర్ని అదే ప్రదేశంలో ఇదే విధమైన సామూహిక అత్యాచారం చేశారు. ఇందులో ఉన్న ముగ్గురు నేరస్థులు కూడా గత రేప్ కేసులో నిందుతులే. ఇక, డిసెంబర్ 2016న, తమిళనాడులోని అరియలూర్లో 17 ఏళ్ల గర్భిణి అయిన దళిత బాలికపై హిందూ మున్నాని యూనియన్ కార్యదర్శి, ముగ్గురు సహచరులు కలిసి భయంకరంగా సామూహిక అత్యాచారం, హత్యకు పాల్పడ్డారు.
ఇక, జూన్ 2017లో ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో 17 ఏళ్ల బాలిక అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి గురైంది. న్యాయం చేయాలని కోరుతూ, ఆమె ఏప్రిల్ 2018లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాసం వెలుపల ఆత్మహత్యకు ప్రయత్నించింది. అలాగే, 2019 నవంబర్లో హైదరాబాద్లో 26 ఏళ్ల వెటర్నరీ డాక్టర్పై నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేశారు. తీవ్ర ప్రకంపనలు రేపిన ఈ ఘటన దిశ అనే చట్ట రూపకల్పనకు దారి తీసింది. ఇక, 2020 సెప్టెంబర్ 14న, ఉత్తర్ ప్రదేశ్లోని హత్రాస్లో 19 ఏళ్ల దళిత మహిళపై నలుగురు అగ్రవర్ణ పురుషులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రెండు వారాల తర్వాత ఆమె మరణించడం వివాదానికి దారితీసింది. ఆమె కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా పోలీసులు ఆమెను బలవంతంగా దహనం చేశారు. ఈ వాదనను అధికారులు ఖండించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఘోరమైన అత్యాచార, హత్యల ఘటనలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఇంత ఘోరమైన కేసుల్లో కొందరికి శిక్ష పడగా ఇంకొందరు ఇప్పటికీ బయట దర్జాగా తిరుగుతున్నారు.
దేశంలో ఇంత జరుగుతున్నప్పటికీ రాజకీయ పార్టీలు మాత్రం వీటిని ఓట్ల కోసం వాడుకుంటున్న పరిస్థితి దేశంలో కనిపిస్తుంది. తాజాగా జరిగిన కోల్కతా సంఘటనే దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా ఉంది. ఒకవైపు దేశమంతా హతురాలికి న్యాయం జరగాలని ప్రయత్నిస్తుంటే.. పొలిటికల్ లీడర్లు మాత్రం తమ పబ్బం గడుపుకోడానికి ఎగబడుతున్నారు. అధికార పార్టీని వేలిత్తి చూపడానికి చేసే ప్రయత్నాల్లో సగం కూడా బాధితులకు న్యాయం జరగాలనే దానిపై పెట్టలేదు. పైగా, రాజకీయ జెండాలెత్తుకొని నిరసన యాత్రలు చేపడుతున్నారు. ఒక సామాజిక బాధ్యతగా తీసుకోలేని దుస్థితి దేశంలో నెలకొంది. కోల్కతా ఘటనలో ప్రాథమికంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రపోలీసులే కేసును టేకప్ చేసినప్పటికీ ఎన్నో అవకతవకలు, అనుమానాలకు తావిచ్చారు. ఆ తర్వాత వచ్చిన కేంద్ర సీబీఐ కూడా దర్యాప్తుతో కాలాన్ని సాగదీస్తుంది తప్ప ఇప్పటి వరకూ, ఘటనలో పూర్తి నిజానిజాలను బయటపెట్టలేదు. ఒకవైపు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండిటికీ చెందిన సంస్థలే కేసును విచారిస్తున్నాయి. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని నడిపై నేతలే ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకుంటున్నారు.
ఇక, తాజాగా రాష్ట్రపతి ముర్ము వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ.. పార్టీలకు అతీతంగా ఈ ఘటనపై న్యాయం కోసం పోరాడాలని పిలుపు ఇచ్చింది. మరోవైపు, పశ్చిమ బెంగాల్కు ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ, టీఎంసీ నేతలు బీజేపీ కుట్ర చేస్తుందంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆగస్ట్ 27న ‘పశ్చిమబంగ ఛాత్ర సమాజ్’ అనే విద్యార్థి సంస్థ చేపట్టిన ‘నబాన్న అభియాన్’ నిరసన ప్రదర్శన లక్ష్యాన్ని మర్చిపోయి రాజకీయ రచ్చకు కారణం అయ్యింది. ఇంత ఘోరమైన అంశాన్ని బీజేపీ, టీఎంసీలు కలిసి రాజకీయం చేసేసారు. ఇలాంటి వాతావరణంలో నిర్భయ చట్టాలు ఎన్ని వస్తే మాత్రం ఉపయోగం ఏముంటుంది..? ప్రభుత్వాలు నడుపుతున్న నేతలు సరైన చర్యలు చేపట్టకుండా సంతాపాలు తెలిపితే లాభం ఏంటీ..?