YCP Leaders Target Mumbai Actress Kadambari Jethwani: అసలు ముంబై నటి జెత్వానీ చేసిన తప్పేంటి? ఎందుకు ఆమెపై అంతా పగ పట్టి హింసించి జైల్లో పెట్టించారో తెలియాలంటే 2015 నుంచి ఏం జరిగిందో చూడాలి. ఒక పరిచయం ఆమె జీవితాన్ని ఇన్ని ఇబ్బందులపాలు చేస్తుందని జెత్వానీ కలలో కూడా ఊహించి ఉండరు. కానీ అదే జరిగింది. సినిమాలకు మించిన ట్విస్టుల్లో ముంబై నటి జీవితం బలైపోయింది. బయటకు రాలేరు. ఇప్పుడు తనకు జరిగిన ఘోరంపై న్యాయం కోసం పోరాడడమే మిగిలింది. ఇంకోవైపు ఈ ఘటన రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.
కుక్కల విద్యాసాగర్.. ఇతడు కొన్నేళ్ల కిందట హైదరాబాద్లో ఓ పెళ్లికి వెళ్లారు. అక్కడే తొలిసారి ముంబై నటికి ఇతడికి పరిచయం ఏర్పడిందంటారు. తాజాగా బయటికొచ్చిన ముంబై నటి జెత్వానీ.. తనకు వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఓ మోడలింగ్ కో-ఆర్డినేటర్ ద్వారా పరిచయం అయ్యాడని చెబుతున్నారు. ఖరీదైన బహమతులిచ్చి మోసగించాలని చూశాడంటున్నారు. 2015లో పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చారని, అయితే అతడికి పెళ్లైన 14 నెలలకే భార్య విడిచిపెట్టి వెళ్లిపోయిందన్న విషయం తెలిసిందంటున్నారు. దేశవ్యాప్తంగా అనేక కేసులున్నాయని తెలిసి దూరంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అప్పట్నుంచి వేధింపులు మొదలయ్యాయని, అసభ్యకర, అశ్లీల మెసేజ్ లు, వీడియోలతో హింసించాడని వాపోయారామె.
సీన్ కట్ చేస్తే జెత్వానీ ముంబైలో ఓ ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తిపై గతంలో ఓ కేసు పెట్టారు. అక్కడ ఆ కేసు వాపస్ చేయించాలన్న ఉద్దేశంతో విజయవాడలో ఆమెపై తప్పుడు కేసులు నమోదు చేయించారా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. విద్యాసాగర్ 2024 ఫిబ్రవరి 2న ఇబ్రహీంపట్నంలో ఓ ఫోర్జరీ డాక్యుమెంట్ను చూపించి జెత్వానీపై కేసు పెట్టారు. జెత్వాని ముంబైలో ఇప్పుడు నివాసం ఉంటున్న ఫ్లాట్ను 2020లో కొనుగోలు చేశారు. అయితే 2018లో కొనుగోలు అగ్రిమెంట్ జరిగింది. అగ్రిమెంట్ మాత్రమే జరిగిన ఫ్లాట్లో ఆమె ఉంటున్నట్టు చూపించి, ఆ ఫోర్జరీ డాక్యుమెంట్ ఆధారంగా చేసుకుని కేసు నమోదు అయ్యేలా చక్రం తిప్పారన్నది ఆరోపణ.
అక్కడితో మ్యాటర్ ఆగలేదు. ఇప్పటిదాకా చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే అని, మిగిలిన రాష్ట్రాల్లోనూ ఇలాంటి కేసులే పెట్టి వేధిస్తామంటూ బెదిరించారంటున్నారు. ముంబైలో కేసు విత్డ్రా చేసుకుంటే ఇక్కడ తనపై కేసు తీసివేస్తామని చెప్పారంటున్నారు. చెప్పాలంటే ఓవరాల్ మ్యాటర్ అంతా ముంబై కేసు చుట్టే తిరిగింది. అదేంటన్నది ఇప్పుడు విచారణలో తేలబోతోంది. డబ్బు, అధికారం అండతో పవర్ ఫుల్ వ్యక్తులంతా తనను ఈ కేసులో ఇరికించారంటున్నారు జెత్వానీ. వారి నుంచి రక్షణ కల్పించాలని, అంతే కాదు వేధించిన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్, నాటి పోలీస్ అధికారులపై కేసులు నమోదు చేసి విచారించాలంటున్నారామె. తనపై పెట్టిన తప్పుడు కేసును క్వాష్ చేయాలని సీఎం చంద్రబాబును, హోంమంత్రి అనితకు విజ్ఞప్తి చేశారు.
Also Read: ముంబై నటి కేసు.. దర్యాప్తులో ఏసీపీ స్రవంతి.. రాత్రంతా, ఇపీఎస్లకు ఇబ్బందులు
ఈ కేసులో నాడు పోలీసులు ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో తెలియాలంటే అప్పటి పోలీస్ ఉన్నతాధికారుల కాల్ డేటా, వాట్సాప్ చాట్ను పరిశీలించాలని జెత్వానీ తరఫు లాయర్ నర్రా శ్రీనివాసరావు డిమాండ్ చేస్తున్నారు. ముంబైలో వ్యాపార కుటుంబానికి చెందిన ఓ వ్యక్తిని రక్షించేందుకే విద్యాసాగర్ ఈ దొంగ కేసు పెట్టారా? అప్పటి వైసీపీ పెద్దల ప్రమేయం ఎంత వరకు ఉంది? వంటి ప్రశ్నలకు పూర్తిస్థాయి విచారణలోనే సమాధానాలు వస్తాయంటున్నారు. అందుకే ఏపీ ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. ఈ వ్యవహారం ఏపీలో సంచలనంగా మారడంతో నాటి ఫిర్యాదుదారు అయిన కుక్కల విద్యాసాగర్ ఎక్కడున్నారో జాడ తెలియడం లేదంటున్నారు. ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేస్తామని విజయవాడ సీపీ అంటున్నారు.
విజయవాడ పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు ఈ కేసు గురించి ఆరా తీశారు. ఈ కేస్ డైరీ ఫైల్ను సీపీ పరిశీలించారు. ఇందులో ఎవరెవరు ఉన్నారు.. అసలేం జరిగింది… ఇవన్నీ తేలాలంటే పారదర్శకంగా దర్యాప్తు జరగాలి. కేసు ఇన్వెస్టిగేట్ చేసి పూర్తి వివరాలు బయటకు తెస్తామంటున్నారు ఏపీ డీజీపీ.
మొత్తంగా ఈ మ్యాటర్ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. వైసీపీ హయాంలో జరిగిన వ్యవహారాలపై సీఎం చంద్రబాబు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇదేనా పార్టీని నడిపే విధానం, సమాజానికి మంచి నేర్పడం ఇదేనా, ఆదర్శంగా ఉండాల్సింది ఇలాగేనా అని ప్రశ్నించారు. ఓవైపు రోజుకో కథనం బయటికొస్తుంటే వైసీపీ నాయకులు కనీసం బయటికొచ్చి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.
కాబట్టి నిజాలు నిలకడ మీద తేలనున్నాయి. జెత్వానీపై తప్పుడు కేసు పెట్టేంతగా తెరవెనుక ఏం జరిగింది? ఎవరున్నారు. పోలీస్ ఉన్నతాధికారులు ఎవరి ఆదేశాలతో కదిలారు.. సీక్రెట్ అంతా ఎక్కడ ఉంది అన్నది త్వరలోనే అంతా బయటకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. నటి జెత్వానీకి న్యాయం చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చింది.