Selfish Lady Love|మూడేళ్లుగా వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఆ యువతి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఆ యువకుడు ఆమెకు సాయం చేసేవాడు. ఆమెకు అనారోగ్యం చేస్తే… వైద్య ఖర్చులు మొత్తం తనే భరించాడు. ఆమె సివిల్స్ శిక్షణ తీసుకుంటానంటే తనే ఫీజులు చెల్లించాడు. కానీ ఆ తరువాత ఆమె మరొకరితో ప్రేమలో పడింది. ఇది తెలిసిన యువకుడు ఆమె తో గొడవపడ్డాడు. అతను ఆమె కొత్త ప్రియుడికి విషయం మొత్తం చెప్పాడు. దీంతో ఆ యువతి అతనిపై పగబట్టింది. ఒక పథకం ప్రకారం.. తన కుటుంబ సభ్యులతో కలిసి అతడిని ముక్కలు ముక్కలుగా నరికేసింది. ఈ రాక్షస ప్రియురాలి ఉదంతం బిహార్ లోని ముజఫర్ పూర్ లో జరిగింది.
పోలీసులు కథనం ప్రకారం.. బిహార్ లోని ముజఫర్ పూర్ జిల్లా సాహెబ్ గంజ్ ప్రాంతానికి చెందిన జయప్రకాశ్(26) అనే యువకుడు అదే ప్రాంతినికి చెందిన ప్రమీల(24, పేరు మార్చబడినది)ను ప్రేమించాడు. ఇద్దరూ గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ప్రమీల చాలా పేద కుటుంబానికి చెందిన యువతి. మరోవైపు మధ్య తరగతి కుటుంబానికి చెందిన జయప్రకాశ్ కూడా డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమీల బిహార్ పబ్లిక్ సర్వీస్ పరీక్షలకు శిక్షణ తీసుకోవాలని పట్నా వెళ్లింది. ఆమె శిక్షణ కోసం జయప్రకాశ్ తన సోదరుడి వద్ద నుంచి తీసుకున్న డబ్బులతో ఫీజు చెల్లించాడు. మరోవైపు జయప్రకాశ్ కు కూడా గోవాలో ఉద్యోగం లభించింది.
ఈ క్రమంలో జయప్రకాశ్, ప్రమీల మధ్య దూరం పెరిగింది. జయప్రకాశ్ ప్రతిరోజు ఫోన్ చేస్తుండే వాడు. కానీ కొన్ని రోజులుగా ఆమె తనతో ఫోన్ లో సరిగా మాట్లాడడం లేదు. ప్రమీలకు ఏదైనా సమస్య వచ్చిందేమోనని జయప్రకాశ్ ఒక్కసారిగా ముజఫర్ పూర్ తిరిగి వచ్చాడు. అక్కడ ప్రమీల మరో యువకుడితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోంది. ఆ యువకుడు ఒక ధనిక కుటుంబానికి చెందిన వాడు. దీంతో ప్రమీల ఇక జయప్రకాశ్ తో మాట్లాడడం మానేసింది. ఇది తెలిసి జయ ప్రకాశ్ చాలా బాధపడ్డాడు. ఒకరోజు ప్రమీల ఒంటరిగా ఉండడం చూసి ఆమెతో గొడవపడ్డాడు. తనను ఎందుకు మోసం చేసిందో నిలదీశాడు? కానీ ప్రమీల ఇకపై అతనికి ఏం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి వెళ్లిపోయింది.
ప్రమీల కోసం జయప్రకాశ్ పడే బాధ చూసి అతని సోదరుడు.. గోవా వెళ్లిపోయి చక్కగా ఉద్యోగం చేసుకోమని సూచించాడు. జయప్రకాశ్ తన అన్న మాటలు విని గోవా వెళ్లిపోయాడు. అక్కడ ప్రతిరోజు ప్రమీలను గుర్తు చేసుకుంటూ ఏడ్చేవాడు. ఒకరోజు ప్రమీలకు బుద్ధి చెప్పాలని.. వారిద్దరూ ప్రేమలో ఉన్నప్పుడు ఆమె నగ్నంగా ఉన్న ఫొటోలు, వీడియోలను ఆమె బంధువులకు, స్నేహితులకు పంపాడు. ఆ ఫొటోలు ప్రమీల కొత్త ప్రేమికుడి వరకు చేరాయి. దీంతో ఆమెను ఆ కొత్త ప్రేమికుడు వదిలేసి వెళ్లిపోయాడు. తనకు అంత ధనిక కుటుంబం నుంచి సంబంధం వస్తే.. చెడగొట్టాడని కోపంతో ప్రమీల.. జయప్రకాశ్ ని హత్య చేయాలని నిర్ణియించింది.
పథకం ప్రకారం.. ప్రమీల ఒకరోజు జయప్రకాశ్ కు ఫోన్ చేసి తాను మారిపోయానని.. నిజమైన ప్రేమను గుర్తించానని.. ఇక తనను క్షమించమని అడిగింది. కానీ జయప్రకాశ్ కు నమ్మకం కుదరలేదు. దీంతో ప్రమీల.. జయప్రకాశ్ ను వెంటనే బయలు దేరి వచ్చి తన తల్లిదండ్రులతో పెళ్లి సంబంధం మాట్లాడాలని చెప్పింది. ఆమె మాటలు నమ్మిన జయప్రకాశ్.. గోవా నుంచి బయలు దేరి ముజఫర్ పూర్ వచ్చాడు. అలా వచ్చిన జయ ప్రకాశ్ ని ప్రమీల బాగా భోజనం చేయించి.. తన కుటుంబ సభ్యులంతా తన మేనమామ ఇంట్లో ఉన్నారని.. అక్కడికి త్వరగా వెళ్లాలని చెప్పింది.
దీంతో జయప్రకాశ్, ప్రమీలతో కలిసి ఆమె మేనమామ ఇంటికి వెళ్లాడు. అయితే అక్కడ జయప్రకాశ్ ఇంటిలోపలికి వెళ్లగానే వెనుక నుంచి ప్రమీల తలుపులు లాక్ చేసింది. అక్కడ ఇంట్లో ప్రమీల తండ్రి, అన్న, మేనమామ కొడుకు ముగ్గురూ కలిసి కత్తులతో జయ ప్రకాశ్ పై దాడులు చేశారు. ప్రమీల అన్న ముందుగా జయ ప్రకాశ్ ని చితకబాది.. అతని గొంతుని కత్తితో కోసాడు. ఆ తరువాత ప్రమీల తండ్రి, మేనమామ కొడుకు జయప్రకాశ్ పొట్ట, వీపు భాగాల్లో కత్తులతో పలుమార్లు పొడిచారు. జయప్రకాశ్ చనిపోయిన తరువాత అతడి శవాన్ని ఒక పెద్ద గోనె సంచిలో కట్టేసి.. సైకిల్ పై వంద మీటర్ల దూరంలో ఒక నిర్మానుషమైన ప్రదేశంలో పడేశారు.
మూడు రోజుల తరువాత పోలీసలుకు ఆ ప్రాంతంలో శవం దొరికింది. అప్పటికే పోలీస్ స్టేషన్ లో జయప్రకాశ్ సోదరుడు మిస్సింగ్ కంప్లెయింట్ చేశాడు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసుని పరిశీలించి.. ఆ శవం జయ ప్రకాశ్ దేనని నిర్ధారణ చేశారు. జయ ప్రకాశ్ సోదరుడు ప్రమీల కుటుంబంపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆమె ఇంటికి వెళ్లారు. కానీ వారంతా మూడు రోజుల క్రితమే ఊరి వదిలివెళ్లిపోయారని తెలిసింది. అయితే ప్రమీల మేనమామ కొడుకు పోలీసుల చేతికి చిక్కాడు. అతడిని తమ దైన శైలిలో పోలీసులు ప్రశ్నిస్తే.. అప్పుడు అతను జరిగినదంతా వివరించాడు. పోలీసులు జయప్రకాశ్ హత్య కేసు నమోదు చేసి.. నిందితులైన ప్రమీల, ఆమె సోదరుడు, తండ్రి కోసం గాలిస్తున్నారు.