Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడ్డారు. సీఎం చంద్రబాబు రాజకీయ అమ్మకాలు.. కొనుగోళ్లు చూస్తుంటే జాలేస్తున్నదని విమర్శించారు. ఆయన గతంలో ఇలాంటి రాజకీయాలతోనే లబ్ది పొందాడని, సీనియర్ ఎన్టీఆర్ను పడగొట్టగలిగాడని తెలిపారు. పాపం ఎన్టీఆర్ అమాయకుడని, కాబట్టి, చంద్రబాబు ఆటలు సాగాయన్నారు. కానీ, జగన్.. ఎన్టీఆర్లా అమాయకుడు కాదని, చంద్రబాబు ఆటలు సాగవని తెలిపారు.
జగన్ను రాజకీయంగా తొలగించుకోవడానికి 2011 నుంచి చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నాడని, కానీ, జగన్ ఎంత తొక్కినా అంతకు మించి బంతిలా పైకి వస్తూనే ఉన్నారని పేర్ని నాని వివరించారు. ఇప్పుడు జంప్ జిలానీలను ప్రోత్సహించి పార్టీలోకి చేర్చుకుని జగన్ను బలహీనం చేయాలని, కుంగదీయాలని చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. జంప్ జిలానీలు జగన్ను కుంగదీయలేవని, జంప్ జిలానీలు జగన్కు అవసరం లేదని, జనం సాయం ఉంటే చాలని స్పష్టం చేశారు. వైసీపీ నుంచి ఎంత మందిని తీసుకున్నా జగన్ను ఒక్క అంగుళం కూడా కిందికి దింపలేవని, ఆయన వెంట జనం ఉన్నారని వివరించారు.
ఒక వైపు రాజీనామా చేసి రావాలని అంటూనే.. మరో వైపు పదవులతోనే పార్టీలో చేర్చుకుంటున్నావని చంద్రబాబుపై పేర్ని నాని విమర్శలు గుప్పించారు. అయినా.. అందరిని చేర్చుకుని ఏం చేసుకుంటారు? జగన్ పడిపయే ఛాన్సే లేదని పేర్కొన్నారు. ఈ రోజు ఇద్దరు సభ్యులతో రాజీనామా చేయించారని, ఈ ఇద్దరి బీసీ స్థానాల్లో సతీశ్, రాకేశ్లు రాజ్యసభకు ఎందుకు వస్తున్నారో అందరికీ తెలుసని, అదే.. ఖాళీ అయిన స్థానాల్లో బీసీ, ఎస్సీలను రాజ్యసభకు పంపే దమ్ముందా? అంటూ సవాల్ చేశారు. దేశంలోనే తొలిసారిగా మత్స్యకారుడిని రాజ్యసభకు పంపిన ఏకైక వ్యక్తి జగన్ అని చెప్పారు. చంద్రబాబు ఇచ్చిన హామీల అమలును పక్కన పెట్టేసి రాజ్యసభ స్థానాల కొనుగోళ్లు, అమ్మకాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
Also Read: Telangana BJP: తెలంగాణ బీజేపీలో విభేదాలు.. రాష్ట్ర అధ్యక్ష పదవికి.. కొత్త నేతలకు అర్హత లేదా..?
వైసీపీ పడినా.. లేచినా తాను జగన్తోనే ఉంటానని పేర్ని నాని అన్నారు. 2029లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని దింపేస్తామని, మళ్లీ వైసీపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర హోం మంత్రిపై విమర్శలు సంధిస్తూ.. రాష్ట్రంలో రోజుకో మానభంగం జరుగుతుంటే హోం మంత్రి చోద్యం చూస్తున్నారా? అని ప్రశ్నించారు. శాంతి భద్రలు గాలికి వదిలేసి ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెడుతున్నారని విమర్శించారు. గతంలో మాట్లాడినట్టే ఇప్పుడు మంత్రి హోదాలో కూడా గాలి మాటలు మాట్లాడితే ఎలా? అని పేర్కొన్నారు.
అనేక అభియోగాలు ఉన్న ఓ మహిళను ప్రధాన పాత్రగా పెట్టి కొందరు పోలీసు అధికారులను తప్పుడు కేసుల్లో ఇరికించాలని అధికార పార్టీ చూస్తున్నదని పేర్ని అన్నారు. ఆ మహిళపై ఉత్తర భారతంలో చాలా రాష్ట్రాల్లో చెప్పడానికే ఇబ్బంది పడే అనేక కేసులు ఉన్నాయని తెలిపారు. ఐపీఎస్ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికే ఇంత డ్రామా చేస్తున్నారని, 2014 నుంచి పార్టీ కార్యాలయం గడప తొక్కని వ్యక్తిని తమకు ఆపాదిస్తున్నారన్నారు. అయినా.. వారు చెబుతున్నట్టుగానే ఆ ఘటన జరిగింది ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. కానీ, ఇప్పుడు దాన్ని తమకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.