Raja Saab: కల్కి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ సినిమాతో బిజీగా మారాడు. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్ టీజీ, వివేక్ కూచిభోట్ల నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
కామెడీ హారర్ లో వస్తున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అందుకు కారణం ప్రభాస్ కామెడీ జోనర్ ను ఎంచుకోవడమే. డార్లింగ్ తర్వాత ప్రభాస్ అన్ని యాక్షన్ మూవీస్ నే చేస్తూ వచ్చాడు. ఇప్పటివరకు యాక్షన్ తో అదరగొట్టిన ప్రభాస్ చాలా గ్యాప్ తర్వాత కామెడీ జోనర్ లో కనిపించబోతుండడంతో .. ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారుతుంది.
ఇక గత కొంతకాలంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. ప్లాప్స్ మధ్య నడుస్తున్న విషయం తెలిసిందే. మంచి మంచి స్టార్ హీరోల సినిమాలు ,మంచి కథలను ఎంచుకున్న కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కి విజయాలు మాత్రం దక్కడం లేదు. గత రెండేళ్లుగా డిజాస్టర్స్ తోనే ఈ బ్యానర్ కాలం వెళ్లదీస్తుంది. ప్రస్తుతం ఈ బ్యానర్ లో పలు స్టార్ హీరోల సినిమాలు తెరకెక్కుతున్నాయి.అందులో ఒకటి స్వాగ్.
హీరో శ్రీ విష్ణు, రీతూ వర్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా నేడు ఈ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ లాంచ్ ఈవెంట్లో టీజీ విశ్వప్రసాద్ కు ఒక ప్రశ్న ఎదురైంది.
తమ బ్యానర్ నుంచి వరుస డిజాస్టర్స్ వస్తున్నాయి అలాంటి డిజాస్టర్ రాకుండా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్న ప్రశ్నకు.. ఆయన మాట్లాడుతూ “రాజా సాబ్ ..ఏప్రిల్ లో వస్తాడు. ఇప్పటివరకు మాకు వచ్చిన నష్టాలను.. రాజా సాబ్ కవర్ చేస్తాడు” అని చెప్పుకొచ్చాడు. ఈ ఒక్క మాట ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
సినిమా మీద ఎంత నమ్మకం లేకపోతే తమ నష్టాలను మొత్తం రాజా సాబ్ తీర్చేస్తాడు అని నిర్మాత బహిరంగంగా చెప్పుకొస్తాడు అని ఫాన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి ఈ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీని నష్టాల నుంచి బయటకు తీసుకు వస్తుందో లేదో చూడాలి. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.