V Hanumantha Rao: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి ఆయన కట్టుబడి ఉన్నారని, ముఖ్యంగా హైడ్రా విషయంలో ఆయన మనవారు.. బయటివారు అన్న బేధాలు చూపించడం లేదని స్పష్టం చేశారు. ఎందుకంటే.. సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యుల ఇంటిని కూడా కూల్చేయాలని ఆదేశించారని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుడి ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నదని, దానిని కూడా కూల్చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించడం శుభపరిణామమని వీహెచ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి దుర్గం చెరువును ఆనుకుని ఉన్న అమర్ సొసైటీలో ఇళ్లు ఉన్నది. ఈ ఇంటికి కూడా హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ విషయాన్ని వీహెచ్ ప్రముఖంగా చెప్పారు.
గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్లో చెరువులు, కుంటలు, ఇతర వనరులను పరిరక్షించాలనే ధ్యేయంతో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను తీసుకువచ్చారని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన అమోఘమని, ఆయన భేషైన వ్యవస్థ తీసుకువచ్చారని ప్రశంసించారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కూడా దూకుడుగా, చక్కగా పని చేస్తున్నారన్నారు. ఈ కూల్చివేతల నుంచి పేదల ఇళ్లకు కొంత ఉపశమనం ఇవ్వాలని పేర్కొన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో పేదల ఇళ్లు ఉంటే.. వాటిని కూల్చేయాల్సి వస్తే మాత్రం వారికి పునరావసమో.. మరో ప్రత్యామ్నాయమో చూపించాలని సూచనలు చేశారు. వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి ఇవ్వాలని పేర్కొన్నారు.
హైదరాబాద్లో చెరువులు, ఇతర వనరుల పరిరక్షణ ధ్యేయంగా హైడ్రా తీసుకువచ్చారని, సీఎం రేవంత్ రెడ్డి భేషైన వ్యవస్థను తీసుకువచ్చారన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చక్కగా పని చేస్తున్నారని కితాబునిచ్చారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నివాసం ఉంటున్న పేదల ఇళ్లను కూల్చివేయాల్సి వస్తే మాత్రం వారికి ప్రత్యామ్నాయం చూపించాలన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించాలని సూచించారు. కొందరు స్మశాన వాటికలను కూడా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని, అలాంటి వాటిని నిలువరించాలని కోరారు.
Also Read: Bharat dojo Yatra: త్వరలోనే భారత్ డోజో యాత్ర.. వీడియో షేర్ చేసిన రాహుల్ గాంధీ.. వివరాలిదిగో..
ఇక రాహుల్ గాంధీపై కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను వీహెచ్ తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో పాపులారిటీ కోసమే కంగనా రనౌత్ అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నదని మండిపడ్డారు. రాహుల్ గాంధీపై నోరుపారేసుకున్న కంగనా రనౌత్ పై ఆయన అంబర్ పేట్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత గాంధీ భవన్కు వచ్చి మాట్లాడారు.
ఓ మహిళా సీఆర్పీఎఫ్ అధికారి.. రైతులపై నోరుపారేసుకున్న కంగనా రనౌత్ చెంప చెళ్లుమనిపించిన ఘటనను వీహెచ్ గుర్తు చేశారు. చెంప దెబ్బ కొట్టినా కంగనా తీరు మారలేదన్నారు. రాహుల్ గాంధీపై ఏమైనా మాట్లాడాలనుకుంటే పార్లమెంటులో మాట్లాడాలని పేర్కొన్నారు. ఇష్టం వచ్చినట్టు తమ నాయకుడిపై కామెంట్లు చేస్తే మాత్రం తాము ఊరుకోబోమని స్పష్టం చేశారు. కంగనా రనౌత్ వెంటనే రాహుల్ గాంధీకి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలా నోటిదురుసుతో మాట్లాడుతున్న కంగనా రనౌత్ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియంత్రించాల్సిన అవసరం ఉన్నదన్నారు.