Big blow to Ys Jagan as 9 YSRCP MPs quit Rajya Sabha: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమినే తట్టుకోలేకపోతున్న వైసీపీకి.. కీలక నేతల వరుస రాజీనామాలు కోలుకోలేని షాక్లు ఇస్తున్నాయి. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, మాజీలైన కీలక నేతలు జగన్కు దణ్ణం పెట్టి వెళ్లిపోతున్నారు. పార్టీ ఉనికి ప్రశ్నార్ధకం చేస్తూ ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. వైసీపీతో పాటు తమ పదవులకు కూడా రిజైన్ చేస్తూ స్ట్రోక్ల మీద స్ట్రోక్లు ఇస్తున్నారు. ఓడిపోయినప్పుడు వలసలపై జగన్ నిర్వేదం వ్యక్తం చేశారు. దానికి తగ్గట్లే జరుగుతోందిప్పుడు.
పోయేవారిని ఆపలేం కదా.. ఇదీ వైసీపీ ఓటమి తర్వాత తాడేపల్లి ప్యాలెస్లో తనను కలిసిన నేతల వద్ద మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యక్తం చేసిన నిర్వేదం. వైసీపీ ఎమ్మెల్సీలు కూటమి పార్టీలతో టచ్లో ఉన్నారని కోటరీ నేతలు జగన్ దృష్టికి తెచ్చినప్పుడు. అంతలా నిర్వేదం వ్యక్తం చేశారాయన .. తన తల్లి విజయమ్మతో కలిసి పార్టీని స్థాపించానని మళ్లీ అక్కడ నుంచే పార్టీని పునర్మిస్తానని అప్పుడు ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయన తల్లి కూడా పార్టీలో లేరను కోండి. అది వేరే విషయం. జగన్కి మాత్రం ఆ పరిస్థితి వస్తున్నట్లే కనిపిస్తుంది.
అనుకున్నట్లే జగన్కి వరుస షాక్లు తగులుతున్నాయి. ఒక్కరోజే వైసీపీకి ట్రిపుల్ షాక్ తగిలింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీలో కీలకంగా ఉన్న ఎంపీ మోపిదేవి వెంకట రమణ గుడ్ బై చెప్పనున్నారు. వైసీపీ ముఖ్యనేతల తీరుపై అసంతృప్తి ఆయన పార్టీని వదలడానికి రెడీ అయ్యారు. మోపిదేవి వెంకట రమణ బాటలోనే బీద మాస్తాన్ రావు కూడా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. టీడీపీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన బీద మస్తాన్రావు.. 2009 ఎన్నికల్లో కావలి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.. 2014 ఎన్నికల్లో తిరిగి పోటీ చేసి ఓడిపోయారు.
బీద మస్తాన్ రావు 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అప్పటినుంచి ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వైసీపీకి దగ్గరయ్యారు. 2020 లో తాను ప్రత్యక్ష రాజకీయాలకు వీడ్కోలు పలుకుతున్నట్లు, శాసనసభకు కానీ, లోక్ సభకు కానీ పోటీ చేయనని ప్రకటించారు. 2022 లో వైసీపీ నుంచి రాజ్యసభకు ఎంపికైన ఆయన కూడా వైసీపీకి, రాజ్యసభ పదవికి రాజీనామా చేయడానికి రెడీ అయ్యారంట.
చీరాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీతో పాటు, ఎమ్మెల్సీ పదవికి కూడా రిజైన్ చేసి. సదరు లేఖను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపారు. 2014లో టీడీపీ తరుఫున చీరాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆమెకు టీడీపీ అధినేత ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. 2019లో టీడీపీ ఓడిపోయిన తర్వాత ఆమె వైసీపీలో చేరి తిరిగి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేశారు. పరిటాల రవి అనుచరవర్గానికి చెందిన నాయకురాలిగా పేరున్న ఆమె టీడీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తుంది.
Also Read: ముంబై నటి వ్యవహారం.. సీఎం చంద్రబాబు రియాక్ట్, అదొక వై‘కామ’ పార్టీ అంటూ..
ఓడిపోయి నిండా రెండున్నర నెలలు గడవక ముందే వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు. 2014లో టీడీపీ తరఫున పోటీ చేసి ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యేగా గెలిచిన శిద్ధా రాఘవరావు మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. తర్వాత 2019లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. బడా గ్రానైట్ వ్యాపారి అయిన శిద్దా వ్యాపార లెక్కలతో తర్వాత వైసీపీలో చేరి 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఆశించారు. అయితే జగన్ మెుండి చేయి చూపించడంతో ఇటీవల రాజీనామా చేశారు.
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా వైసీపీకి పెద్ద షాక్ ఇచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు … వైసీపీలో తగిన ప్రాధాన్యత సరైన గుర్తింపు లేకపోవడం వల్లే పార్టీని వీడుతున్నట్లు దొరబాబు ప్రకటించారు. రాజకీయ స్వలాభం కోసం కాదని, పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు … టీడీపీ, జనసేన, బీజీపీ కూటమిలోని ఏదో ఒక పార్టీలో తాను చేరుతానని మాజీ ఎమ్మెల్యే దొరబాబు స్పష్టం చేశారు.
ఏలూరులో వైసీపీ దాదాపు ఖాళీ అయిపోయింది. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సైతం పార్టీ పదవులతో పాటు వైసీపీకి కూడా రాజీనామా చేశారు … ఆయన అనుచరుడు ఏలూరు సిటీ వైసీపీ అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్ కూడా జగన్కి తూచ్ చెప్పి టీడీపీలో చేరిపోయారు. తాజాగా ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్, పెదబాబు దంపతులు సైతం పసుపు కండువా కప్పేసుకున్నారు. మేయర్తో పాటు 30 మంది ఏలూరు కార్పొరేటర్లు కూడా ఫ్యాను పార్టీకి గుడ్బై చెప్పేశారు. దాంతో వైసీపీకి పెద్ద దిక్కులేకుండా పోయి … ఇక ఏలూరులో వైసీపీ కథ కంచికి చేరినట్లే అంటున్నారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య కూడా ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పారు.. 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన మద్దాలి గిరి వైసీపీకి మద్దతు తెలిపారు. 2014 ఎన్నికల్లో జగన్ ఆయనకు ఎమ్మెల్యే సీటు కేటాయించలేదు. దాంతో ఆయన ఎన్నికల ముందు నుంచే వైసీపీకి దూరమయ్యారు. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య సైతం ఈ మధ్య వైసీపీకి రాజీనామా చేశారు. రోశయ్య ఇటీవల గుంటూరు లోక్సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు.
మరోవైపు వైసీపీ అధిష్టానంపై ఆ పార్టీ నేత, మాజీ మంత్రి, వైఎస్ కుటుంబానికి బంధువు అయిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. పార్టీ తనను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అంతేకాదు.. తానే పార్టీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. ఎన్నికలు ముగిసిన తరువాత నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నానని ఆయన బహిరంగంగానే ప్రకటించారు. ఆయన తనను పార్టీ పట్టించుకోకపోవడమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చారు. ఆ క్రమంలో బాలినేని కూడా జగన్కు హ్యాండ్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన జనసేనలో చేరే అవకాశముందంటున్నారు. మొత్తానికి వైసీపీ పునర్మిర్మాణానికి జగన్ పెద్ద కసరత్తే చేయాల్సి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది.