Siddipet MLA Harish rao slams CM Revanth Reddy: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. రుణమాఫీ అంశాన్ని ప్రస్తావిస్తూ సీఎం రేవంత్ రెడ్డి తీరును తప్పుబట్టారు. రుణమాఫీ గురించి రేవంత్ రెడ్డి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని పేర్కొన్నారు. రుణమాఫీ చేయని పెద్ద గజదొంగ రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. దేవుళ్లని మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డిద పేర్కొన్నారు. రుణమాఫీ ఇంకా కానేలేదని మంత్రులు చెబుతుండగా.. రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీకి వెళ్లి రైతులందరికీ రుణమాఫీ చేశామని రాహుల్ గాంధీకి చెబుతున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తే తాను ఆహ్వానించి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గానికి తీసుకెళ్లి రుణమాఫీ అందరికి జరగలేదని నిరూపిస్తానని సవాల్ చేశారు.
ఆగస్టు 15వ తేదీలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని తాను సవాల్ చేసినట్టు మాజీ మంత్రి హరీశ్ రావు గుర్తు చేశారు. కానీ, ఇంకా రైతులందరికీ రుణమాఫీ కాలేదని, వాస్తవం ఇలా ఉండగా రేవంత్ రెడ్డి మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షపాత పార్టీ అని హరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి అని వివరించారు. రైతుల పక్షాన నిలిచిన పార్టీ తమదేనని, రైతులు ఢిల్లీలో ధర్నా చేసినప్పుడూ తమ పార్టీ బాసటగా నిలిచిందని గుర్తు చేశారు.
ఇక హైడ్రా గురించి మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కారు కూల్చివేతల సర్కారు అని హరీశ్ రావు విమర్శించారు. దేవుళ్ల మీద ఓట్లు వేసి ప్రజల విశ్వాసాన్ని కూల్చివేసిన చరిత్ర రేవంత్ రెడ్డికే దక్కుతుందని ఆరోపించారు. బుద్ధ భవన్ ఆఫీస్ హుస్సేన్ సాగర్ నాలా కింద ఉన్నదని, మరి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుద్ధ భవన్ను ఎందుకు కూలగొట్టడం లేదని ప్రశ్నించారు. ముందు బుద్ధ భవన్ కూల్చి మిగిలిన వాటిని కూల్చాలని, మరి ఐ మాక్స్, లుంబిని పార్క్, బోట్స్ క్లబ్ల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ముందు వాటిని కూల్చకుండా తమ పార్టీ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఆఫీసు కూలగొడతామనడం సరికాదని అభిప్రాయపడ్డారు.
Also Read: Bharat dojo Yatra: త్వరలోనే భారత్ డోజో యాత్ర.. వీడియో షేర్ చేసిన రాహుల్ గాంధీ.. వివరాలిదిగో..
వాల్మికీ స్కామ్ జరిగిందని హరీశ్ రావు పేర్కొంటూ.. కర్ణాటక ప్రభుత్వ ఖజానా నుంచి నేరుగా గోల్డ్ షాపులకు, కార్ల అకౌంట్స్కు డబ్బులు వెళ్లాయని తెలిపారు. 9 కంపెనీలకు డబ్బులు వచ్చినట్టు అన్ని చూపించామని, వాల్మికి స్కామ్ను ఇంత వరకు ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఖండించలేదని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటయ్యాయని, అందుకే బీజేపీ కూడా నోరెత్తడం లేదని ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే వాల్మికి స్కామ్లో ఈడీ విచారణ చేపట్టాలని, ఈ స్కామ్లో రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తెలంగాణలోనూ పెద్ద ఎత్తున కుంభకోణాలు జరుగుతున్నాయని, సివిల్ సప్లయ్లో కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు.
ఇక రేవంత్ రెడ్డి కొత్తగా నాలుగో సిటీ అని పాట పాడుతున్నారని, ఈ పేరు మీద ప్రభుత్వ భూములు కొల్లగొట్టే పనిలో ఉన్నారని హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. కందుకూరు గ్రామంలో 385 ఎకరాలు, తుక్కుగూడలో 25 ఎకరాల భూమిని కొల్లగొడుతున్నారన్నారు. ముచ్చర్ల గ్రామంలో ప్రభుత్వ పెద్దలుగా చెలామణి అవుతున్న సీఎం రేవంత్ రెడ్డి తమ్ముళ్ల పీఏల పేరు మీద భూములు చెలామణి అవుతున్నాయని ఆరోపించారు. త్వరలోనే అన్ని వివరాలను తాను బట్టబయలు చేయబోతున్నట్టు తెలిపారు.