Why Indian Army Orders 73,000 More American-Made Sig-716 Assault Rifles: భారత్ ఏరి కోరి SIG-716 రైఫిళ్లను కోరుకుంటుంది సరే.. అయితే, ఈ రైఫిళ్లు ఎలా పని చేస్తాయి..? ప్రపంచదేశాల నుండి మంచి ఫీడ్ బ్యాక్ ఉన్న వీటి కంటే, నిన్నటి వరకూ మాట్లాడిన AK-203 బెటర్ అనే వాదనలో ఎంత నిజముంది..? ఈ రెండిటికీ మధ్య ఉన్న తేడా ఏంటి..? సిగ్ సాయర్ తయారుచేస్తున్న SIG-716 కంటే బెటర్ రైఫిల్ భారత్ దగ్గర లేదా..? మరి భారత్ స్వదేశంలో తయారుచేస్తున్న రైఫిళ్ల మాటేంటీ..?
భారత సైన్యం రైఫిల్ ఆధునికీకరణ అనేది విస్తృతంగా కనిపిస్తున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులతో ముడిపడి ఉంది. ముఖ్యంగా, చైనాతో 2020 గాల్వాన్ వ్యాలీ ఘర్షణ, తూర్పు లడఖ్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా భారత సైన్యానికి అధునాతన ఆయుధాల అవసరం మరింతగా పెరిగింది. ఇందులో భాగంగా గతంలోనే భారత్ రష్యా నుండి AK-203 రైఫిల్స్ను పొందాలని అనుకుంది. అయితే, ఉత్తర్ ప్రదేశ్లోని కోర్వా ప్లాంట్లో రష్యాతో కలిసి జాయింట్ వెంచర్లో తయారు చేయాల్సిన AK-203 అసాల్ట్ రైఫిల్స్ ఉత్పత్తిలో సుదీర్ఘ జాప్యం వల్ల అనుకున్న లక్ష్యం ఆలస్యం అయ్యింది. కరోనా మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధం, ఇతర లావాదేవీల సమస్యలతో పాటు, ప్లాంట్ కార్యకలాపాలు ఆలస్యం అయ్యాయి. ఈ పరిణామాల మధ్య, భారతదేశం తక్షణ రైఫిల్ అవసరాల కోసం వేరే దేశం వైపు చూడాల్సి వచ్చింది.
దేశంలో నెలకొన్న ఈ పరిస్థితి వల్ల అమెరికాకు చెందిన సిగ్ సాయర్ రైఫిల్స్ అత్యవసర సేకరణ అనివార్యమయ్యింది. ఎట్టకేలకు కోర్వా ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభమైనప్పటికీ, గతంలో భారత సైన్యానికి 35 వేల AK-203 రైఫిల్స్ పంపిణీ అయ్యాయి. ఆధునిక అసాల్ట్ రైఫిల్స్కు డిమాండ్ ఎక్కువగా ఉన్న తరుణంలో… సిగ్ సాయర్ నుండి వచ్చిన ఈ తాజా ఆర్డర్ దేశ సరిహద్దులను రక్షించడానికి ఉపయోగపడుతున్నాయి. అంతకుమించి, భారత సైనికులు సాధ్యమైనంత ఉత్తమమైన ఆయుధాలను కలిగి ఉన్నారని నిర్ధారించడానికి ఈ తాజా డీలింగ్ సహాయం చేసింది.
రష్యా AK-203 కలాష్నికోవ్ రైఫిళ్ల తయారీకి సంబంధించి జాప్యం కారణంగా 2019లో తీసుకున్న 72 వేల 400 SiG-716 రైఫిళ్లలో 66 వేల 400 ఆర్మీకి, 4 వేల రైఫిళ్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి… 2 వేల రైఫిళ్లు నేవీ కోసం దిగుమతి చేసుకున్నారు. కాగా, రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్స్ కౌన్సిల్ గత ఏడాది డిసెంబర్లో అదనంగా 73 వేల SiG-716 రైఫిళ్ల సేకరణకు అనుమతి ఇచ్చింది. దీనికి, రూ.837 కోట్లు ఖర్చు చేస్తున్నారు. వీటితో పాటు, భారత్ ఆర్మీ 40 వేల 949 లైట్ మెషిన్ గన్లను కూడా కొనుగోలు చేస్తోంది. వీటిని ఆగస్టు 2023లో రూ.2 వేల 165 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో క్లియర్ చేసింది.
అయితే, గతంలో SiG-716 రైఫిల్స్లోని లోపాలున్నాయని కొన్ని నివేదికలు వెల్లడించాయి. ఈ నివేదికలను భారత సైన్యం తోసిపుచ్చింది. స్వదేశీ INSAS లేదా రష్యన్ AK-47తో పోలిస్తే అమెరికాకు చెందిన రైఫిల్స్ “సుదీర్ఘ పరిధి, మరింత ప్రాణాంతకం, అధిక మన్నిక” కలిగి ఉన్నాయని భారత సైన్యం పేర్కొంది. అయితే, SiG-716 రైఫిల్స్లో వాడే బుల్లెట్ల ఖరీదు ఎక్కువ గనుక దాని కోసం భారతీయ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు తయారు చేసిన మందుగుండు సామగ్రిని ఉపయోగిస్తున్నట్లు సైన్యం తెలిపింది. ఇక, ఆప్టికల్ సైట్లు, అండర్ బారెల్ గ్రెనేడ్ లాంచర్లు, ఫోర్హ్యాండ్ గ్రిప్లు, బైపాడ్లు, లేజర్ పాయింటర్లు వంటి వివిధ పరికరాలు, ఉపకరణాలను మౌంట్ చేయడానికి ఎటువంటి మార్పులు లేకుండా రైఫిల్స్లో పికాటిన్నీ రైల్స్ కూడా అమర్చబడి ఉంటాయని సైనిక అధికారులు చెబుతున్నారు.
Also Read: ఇండియన్ ఆర్మీ చేతికి మరో బ్రహ్మాస్త్రం.. వీటి ప్రత్యేకతలు ఇవే..!
SIG-716 రైఫిల్స్ పనితనం దగ్గరకు వస్తే…. ఈ రైఫిళ్లు 7.62 బై 51mm క్యాలిబర్ గన్లు. ఇవి 500 మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో కాల్చగలవు. అందుకే, వీటిని ప్రత్యేకంగా చైనా, పాకిస్తాన్ వైపున్న సరిహద్దుల వెంబడి పెట్రోలింగ్ చేస్తున్న పదాతిదళ బెటాలియన్ల కోసం భారత్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. SIG-716, సుమారు 4 కిలోగ్రాముల బరువు, గ్యాస్-ఆపరేటెడ్ రొటేటింగ్ బోల్ట్ సిస్టమ్ను కలిగి ఉంది. దాదాపు 600 మీటర్ల పరిధిని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇది దాడి చేయడానికి, స్నిపర్ పాత్రలకు అనువైన ఆయుధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. దీనికున్న మల్టీ టాలెంట్, విశ్వసనీయత వల్ల భారత సైన్యం ఎదుర్కుంటున్న సవాలుతో కూడిన భూభాగాలు, అధిక-ఒత్తిడితో కూడిన పోరాట పరిస్థితులలో ఈ రైఫిల్ కీలకమైందిగా పేర్కొంటున్నారు. ఇక, వీటితో పోల్చితే, 7.62 బై 39mm క్యాలిబర్ రైఫిల్ అయిన రష్యన్ AK-203 రైఫిల్ 300 మీటర్ల ప్రభావవంతమైన పరిధిని కలిగి ఉంది. అయితే, ఇది 11 లక్షలకు పైగా బలమైన భారత సైన్యం, ఎయిర్ ఫోర్స్, నేవీల మొత్తం అవసరాలను తీర్చగలదనే నమ్మకం కూడా ఉంది.
ఇక, అసాల్ట్ రైఫిల్స్ ఫ్రంట్లో, ఇండో-రష్యా రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే జాయింట్ వెంచర్ కింద ఉత్తర్ ప్రదేశ్లోని అమేథీ జిల్లాలోని కోర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో AK-203 అసెంబుల్ చేసారు. దీని తర్వాత మొదటి 35 వేల కలాష్నికోవ్ AK-203లను సైన్యానికి అందించారు. ఇక, కోర్వా ఫ్యాక్టరీలో 10 ఏళ్లలో ఆరు లక్షల AK-203 రైఫిల్స్ను తయారు చేయాల్సి ఉంది. నిజానికి, AK-203 ప్రాజెక్ట్ మొదట 2018లో ప్రకటించబడినప్పటికీ.. ఖర్చు, రాయల్టీ, టెక్నాలజీ బదిలీ, దేశీయీకరణ స్థాయి, ఇతర సమస్యల కారణంగా భారీ జాప్యం జరిగింది. ఇక, భారతదేశంలో రష్యన్ AK-203 అసాల్ట్ రైఫిల్ తయారీకి చివరి అడ్డంకులు తొలగిపోవడంతో.. చాలా విమర్శలకు గురైన భారత స్వదేశీ INSAS రైఫిల్ను భర్తీ చేయడానికి ఉపయోగించారు. ఇప్పుడు, అమెరికా నుండి SIG-716 రైఫిళ్లతో పాటు, రష్యాతో కలిసి తయారుచేస్తున్న AK-203 అసాల్ట్ రైఫిల్ కూడా భారత్ సైన్యంలో ప్రభావవంతమైన మార్పుకు కారణం అయ్యాయి.
అయితే, భారత్లో స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన INSAS కంటే అమెరికా, రష్యన్ రైఫిళ్లే మెరుగ్గా ఉన్నాయన్నది స్పష్టం అయ్యింది. మరోవైపు, భారతదేశంలో ఆయుధ తయారీకి సంబంధించి పూర్తి స్వదేశీకరణ సాధించడానికి ధరల సమస్య అడ్డంగా ఉంది. రైఫిల్స్ను దిగుమతి చేసుకోవడానికి తీసుకునే దానికంటే దేశీయంగా ఉత్పత్తికి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంటుందని నివేదికలు కూడా చెబుతున్నాయి. అయితే, భారత్లో ఉత్పత్తి చేసే ప్రతి రైఫిల్పై రాయల్టీ రుసుమును తగ్గించడానికి రష్యా అంగీకరించడంతో.. ఈ ధరల సమస్య క్రమబద్ధీకరించబడిందని ఇటీవలి నివేదికలు తెలిపాయి. దీనితో దేశీయంగా తయారుచేసే INSAS స్థానంలో AK-203 రైఫిళ్ల ఉంటాయన్నది స్పష్టం అయ్యింది.