Congo’s Mpox Crisis: ప్రపంచానికి మరో వైరస్ పొంచి ఉంది. మంకీపాక్స్ రూపంలో దూసుకొస్తుంది. ఇప్పటికే డెమెక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో వైరస్ తీవ్రతరం అవుతోంది. ఈ వైరస్ ఊహించని విధంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో ఆ దేశ ప్రజలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. వైరస్ను కనిపెట్టేందుకు అవసరమైన నిధులు, పరికరాలు లేని ప్రాంతాల్లో వైరస్ విపరీతంగా వ్యాపిస్తుంది. ఈ సంక్షోభం పరిష్కారంలో ఆ దేశం పూర్తిగా విఫలమైంది. దీంతో ఆ దేశ ప్రజలనుంచి విమర్శలు ఎదుర్కొంటుంది. వైరస్ వ్యాప్తి, తీవ్రత వంటి విషయాలపై ఆందోళన నెలకొంది.
గతేడాది నుంచి ఇప్పటివరకు కాంగోలో ఎంపాక్స్ కేసులు దాదాపు 27వేలకుపైగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే ఇందులో 1,300 మంది మరణించినట్లు నిర్ధారణ జరిగింది. ఈ వైరస్ వ్యాప్తిలో ఎక్కువగా పిల్లలకు సోకినట్లు వెల్లడైంది. దాదాపు 9వేల మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఈ వ్యాధి ప్రభావం పెరుగుతుందని కొంతమంది నిపుణులు హెచ్చరించినా అధికారులు పట్టించుకోకపోవడంతో మరణాల సంఖ్య భారీగా పెరుగుతుంది. దాదాపు మరణాల్లో 80శాతం పిల్లలే ఉండడంతో ఆందోళన కలిగిస్తుంది.
ప్రధానంగా పిల్లలకు టీకాలు అందించడంలో జాప్యం జరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే పిల్లల్లో మరణాల రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ.. ప్రాథమిక టీకాను అందించడంలో అధికారులు విఫలమవుతున్నారు. వైరస్ వ్యాప్తని నియంత్రించడంతోపాటు మరింత ప్రాణనష్టాన్ని అరికట్టాలని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
పిల్లల్లో మరణాల సంఖ్యను తగ్గించేందుకు టీకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు వాదిస్తున్నారు. అయితే కాంగో దేశంలో పలు ప్రాంతాల్లో పోషకాహారలోపంతో పాటు పారిశుద్ధ్య సమస్యలు వేధిస్తున్నాయి. దీంతో సంక్షోభం మరింత తీవ్రమైంది. ఈ పరిస్థితుల్లో పిల్లలకు వైరస్ వేగంగా వ్యాపించడం, కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఈ సమస్యల పరిష్కారంతోపాటు టీకా ప్రయత్నాలు వేగం పెంచాలని కోరుతున్నారు.
Also Read: ‘టెలిగ్రామ్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు, డ్రగ్స్ బిజినెస్’.. ఫ్రాన్స్ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు
టీకా అందించడంతోపాటు వైరస్ తీవ్రతరమైన రోగులకు చికిత్స అందించాలని పలు దేశాలు సైతం సూచిస్తున్నాయి. ఈ మేరకు అంతర్జాతీయ సంస్థలు సైతం వ్యాక్సినేషన్ ప్రాధాన్యతపై పున:పరిశీలనకు మద్దతు ఇస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు మూకుమ్మడిగా కట్టడి చేయాలని ఆలోచిస్తున్నాయి.