Hydra send Notices to builders nearby constructed Durgam cheruvu: అది హైదరాబాద్ మహానగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతం. నగరంలోని పలు సంపన్న విలాసాలు, బడా అపార్టుమెంటులకు పెట్టింది పేరు. ఇక్కడ నివాసముండాలంటే మినిమం ప్లాట్ రూ.కోటిన్నర పైనే. అలాంటి ప్రాంతంలో దుర్గం చెరువు ఉంది. దీనినే రాయదుర్గం చెరువు అని కూడా పిలుస్తారు. 83 ఎకరాలలో విస్తరించి వున్న ఈ చెరువు అటు హైటెక్ సిటీకి.. ఇటు హైదరాబాద్ నగరానికి వారధిగా ఉండటంతో దీనిపై రాకపోకలకు అనువుగా ఉండేందుకు దీనిపై కేబుల్ వంతెన అత్యంత ఆకర్షణీయంగా నిర్మించారు. ఈ దుర్గం చెరువుకు దాదాపు 149 పక్షి జాతులు వచ్చి చేరుతుంటాయి. పర్యాటకులకు కనువిందు చేస్తుంటాయి. ఒకప్పుడు గోల్కొండ కోట నివాసితులకు తాగునీటి చెరువుగా ఉండే దుర్గంచెరువు కాలక్రమంలో కాలుష్య చెరువుగా మారింది.
ఆక్రమణలకు గురైన చెరువు
దుర్గం చెరువు చుట్టుపక్కల ప్రాంతాలలో అనేక ఆక్రమణలకు గురయింది. ఇటీవల చెరువుల ఆక్రమణపై కొరడా ఝుళిపిస్తున్నరాష్ట్ర ప్రభుత్వం ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన సంగతి విధితమే. ఇప్పుడు అదే మాదాపూర్ లో ఉన్న దుర్గం చెరువు పరిసర ప్రాంతాలపై దృష్టి పెట్టింది. అప్పట్లో అనుమతులు తీసుకోకుండా ఆక్రమిత ప్రాంతం అయిన ఈ చెరువు చుట్టు పక్కల అనేక వాణిజ్య సముదాయాలు వెలిశాయి. అలాగే నివాసిత ఇళ్లు, అపార్టుమెంటులు పెద్ద ఎత్తున కట్టుకున్నారు. కేవలం అద్దెల రూపంలోనే లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. అయితే వర్షం వచ్చినప్పుడల్లా నీరు పోయే మార్గం లేక వరద నీరు రోడ్డు పైకి, లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి నీరు చేరడంతో నిర్వాసితులు గతంలో చాలా సార్లు ఫిర్యాదు చేసినా.. నాటి పాలకులు పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో ఆక్రమణలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.
ప్రముఖులకు నోటీసులు
శేరిలింగంపల్లి తాహశీల్దార్ ఇప్పటికే 204 మందికి నోటీసులు పంపారు. నెల రోజుల్లో ఎవరికి వారే స్వచ్ఛందంగా అక్రమ నిర్మాణాలు తొలగించుకోవాలని.. లేకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ నోటీసులు పంపారు. అయితే ఈ పరిధిలోనే సీఎం సోదరుడు తిరుపతి రెడ్డికి సైతం నోటీసు పంపినట్లు సమాచారం. కావూరి హిల్స్, డాక్టర్స్ కాలనీ, నెక్లార్ కాలనీ తదితర నివాసిత ప్రాంత వాసులకు నోటీసులు పంపించారు అధికారులు. ఈ కాలనీలలో ఎక్కువ శాతం సినీ, రాజకీయ, వ్యాపార సెలబ్రిటీలు ఉండటం గమనార్హం.
నెల రోజుల్లో వివరణ ఇవ్వాలి..
ఇప్పటికే చెరువు ప్రాంతాలలో అక్రమ నిర్మాణాలు చేసుకున్నవారికి హెచ్చరికలు చేస్తున్నారు హైడ్రా అధికారులు. ఒకవేళ కూల్చివేతలు చేపట్టినట్లయితే అందుకు అయిన ఖర్చు కూడా సంబంధిత యజమానులే భరించాలని అంటున్నారు. కోర్టు కూడా కూల్చివేతలకు అభ్యంతరం తెలపకపోవడంతో హైడ్రా అధికారులు బఫర్ జోన్ లో ఇండ్లు, కమర్షియల్ భవనాలు కట్టుకున్నవారి వివరాలు సేకరిస్తున్నారు. ఒకప్పుడు సిటీకి దూరంగా ఉండే చెరువులు హైదరాబాద్ నగర జనాభా పెరిగిపోవడంతో చెరువుల ప్రాంతాలను కూడా కబ్జా చేయడం ప్రారంభించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందునుంచే చెబుతూ వస్తోంది. తాము అధికారంలోకి వస్తే ఇలాంటి ఆక్రమణలకు అడ్డుకట్టవేసి చెరువులను భూ బకాసురుల చెర నుంచి కాపాడతామని చెప్పారు. ఇప్పుడు చెప్పినట్లుగానే చేస్తున్నారని సీఎం రేవంత్ ను అభినందిస్తున్నారు సిటీ వాసులు.